(హిందూపురం- సూర్య ప్రత్యేక ప్రతినిధి):పట్టణాలు ప్రగతికి చోదక శక్తులు. పురాల్లోని మెరుగైన విద్య, వ్కెద్యం, ఉపాధి అవకాశాలు, ఆధునిక హంగులు.. పల్లెలను రారమ్మని ఆహ్వానిస్తున్నాయి. ఈ ఒరవడితో పట్టణీకరణ జోరుగా సాగుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారమే పట్టణవాసుల సంఖ్య జనాభాలో 30 శాతం. తాజా అంచనాల ప్రకారం ఇది 33 శాతం దాటింది. రానున్న రోజుల్లో ఇది 40 శాతం చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. పుర జీవనం సవాళ్లతో కూడినదే. వలసలతోపాటే మురికి వాడలు వెలిశాయి. కనీస సౌకర్యాలు కొరవడుతున్నాయి. పురపాలనలో నవ్యత లేని దరిమిలా వసతుల లేమి, ప్రణాళిక లోపం, సమాచార సేకరణ, దస్త్రాల నిర్వహణలో వ్కెఫల్యం, అవినీతి, అక్రమాలు పరిపాటిగా మారింది. వీటికి సాంకేతికతతో అడ్డుకట్ట వేసి పాలనలో సమూల మార్పులు తెచ్చి పురాలను ప్రగతి దిశగా నడిపించడానికి అడుగులు పడుతున్నాయి. ఇందుకు ఉపగ్రహ సేవలను వినియోగించనున్నారు. వాటిని క్ష్త్రే స్థాయిలో అనుసంధానం చేసుకోవడానికి సమగ్ర సర్వేకు రంగం సిద్ధమైంది. ఈ సర్వేలో ప్రతి పట్టణాన్ని జి.ఐ.ఎస్. (జియోగ్రాఫిక్ ఇనాేర్మేషన్ సిస్టమ్) పద్ధతిలో ఫొటోలు తీసి ప్రాథమిక పటాలను తయారు చేయడం, ప్రతి ఇంటి విస్తీర్ణాన్ని కొలతలు తీసి ఆస్తి పన్నును రికార్డుల్లో నవీకరించడం, ప్రతి ఇంటికి అన్ని వివరాలతో కూడిన 11 నెంబర్లు ఉన్న డిజిటల్ ఇంటి నెంబర్ను కేటాయించనున్నారు. జిల్లాలో ప్రతి పట్టణంలో ఉన్న ప్రతి ఇంటిని, కట్టడాన్ని, కాలనీలను, వీధులను మొదటగా ఉపగ్రహాల సాయంతో జి.ఐ.ఎస్. పద్ధతిలో ఫొటోలు తీయనున్నారు. ప్రతి భవనాన్ని అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా కచ్చితమైన కొలతలతో ఫొటోలు తీసి, తర్వాత వాటిపై క్ష్త్రేస్థాయిలో సర్వే నిర్వహించనున్నారు. సర్వేలో సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి భవనం విస్తీర్ణం ఎంత? ఎన్ని అంతస్తులు ఉంది? ఎందుకు ఉపయోగిస్తున్నారు? నీటి సౌకర్యం ఉందా? కాలువలు ఉన్నాయా? ఇలా పట్టణాల్లో 58 వివరాలను సేకరించి ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. ఎక్కడెక్కడ ప్రభుత్వ భవనాలు ఉన్నాయి.. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, నీటి పంపింగ్ హౌస్లు, నీటి ట్యాంకులు, చెరువులు, కుంటలు, రహదారి ఇలా ప్రతి అంశాన్ని ఫొటో తీసి 3-డి టెక్నాలజీలో పట్టణ మ్యాప్లను తయారు చేయనున్నారు. భవిష్యత్తులో పట్టణానికి సంబంధించిన అన్ని వివరాలు ఆన్లైన్లోనే ఫొటోతో సహా ఉండేలా చూడనున్నారు.
అక్రమాలకు అడ్డుకట్ట ఇలా
పట్టణ భవిష్యత్తు అవసరాలను దష్టిలో ఉంచుకొని సమగ్ర సర్వే చేపట్టినా, తొలి దశలోనే సర్వేతో మున్సిపల్ రెవెన్యూ విభాగంలోని అక్రమాలకు అడ్డుకట్ట వేయనున్నారు. ఆస్తి పన్ను నిర్ధరణలో... సిబ్బంది చేతివాటం చూపడం, తక్కువ పన్ను వేయడం, అనేక భవనాలకు పన్ను వేయకుండా వదిలేయడం తదితర అక్రమాలకు పాల్పడేవారు. ప్రస్తుతం సర్వే రెండు రకాలుగా నిర్వహించనున్నారు. ప్రతి భవనాన్ని ఉపగ్రహంతో ఫొటో తీయనున్నారు. అదే భవనాన్ని ప్రత్యేకంగా నియమించిన సిబ్బంది క్ష్త్రే స్థాయిలో సర్వే చేయనున్నారు. భవన విస్తీర్ణం ఎంత, ఎన్ని అంతస్తుల్లో ఉంది? ఏ అవసరాలకు (గ హ, వాణిజ్య, పరిశ్రమ) ఉపయోగిస్తున్నారు? తదితర సమాచారాన్ని సేకరించి, ప్రతి భవనానికి ప్రత్యేక నెంబర్ను కేటాయించి ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. ఇదే భవనానికి సంబంధించి ప్రస్తుతం మున్సిపాల్టీ వద్ద ఉన్న నివేదికలతో పోల్చి.. పాత వివరాల్లో తేడాలు ఉంటే కొత్తవి అందులో పొందుపరిచి, నవీకరణ చర్యలు తీసుకొన్నారు. వెరసి అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. ఇలా ఉపగ్రహాల సాయంతో సర్వే నిర్వహించి, వాటి వివరాల ఆధారంగా క్ష్త్రే స్థాయిలో తనిఖీలు జరపడంతో బెంగళూరు పట్టణంలో 80 శాతం అదనంగా ఆస్తి పన్ను పెరిగింది. పన్ను చెల్లించని అనేక భవనాలు వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి సర్వేను నాలుగేళ్ల కిందట హైదరాబాద్లో ప్రయోగాత్మకంగా కొన్ని వార్డుల్లో నిర్వహిస్తే అక్కడ 100 శాతం పన్ను ఆదాయం పెరిగింది. నివాస భవనాలుగా రికార్డుల్లో పేర్కొని వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్న అనేక భవనాల బండారం బయట పడింది.
ప్రతి ఇంటికి డిజిటల్ నెంబర్
పట్టణాల్లో ప్రతి కట్టడానికి ఇంటి నెంబర్ను కేటాయించనున్నారు. ఈ నెంబర్ను ఆన్లైన్లో నమోదు చేయగానే ఇంటికి సంబంధించిన అన్ని వివరాలు ప్రత్యక్షమయ్యేలా రూపొందించారు. 11 నెంబర్లు ఉన్న ఈ విధానంలో మొదటి రెండు నెంబర్లు పట్టణాన్ని, తరువాత మూడు నెంబర్లు వార్డును, ఆపై మూడు నెంబర్లు వీధిని, చివరి మూడు నెంబర్లు ఇంటి వివరాలను తెలియజేస్తాయి. ఈ 11 అంకెల నెంబరును ప్లేట్పై ముద్రించి ప్రతి ఇంటికి మున్సిపాల్టీ వారు అందజేయనున్నారు.
రెండు నెలలు సమగ్ర సర్వే
అన్ని పట్టణాల్లో ఈ నెల 22 నుంచి సర్వే ప్రారంభం కానుంది. సర్వే నిర్వహణకు కన్సల్టెంట్లను ఎంపిక చేశారు. వారు ఉపగ్రహ ఛాయాచిత్రాలను ఓ వ్కెపు సేకరిస్తూనే, క్ష్త్రే స్థాయిలో సర్వేకు ప్రతి పట్టణంలో 60 మంది గణకులను నియమించారు. ప్రతి గణకుడు రోజుకు 40 భవనాలకు సంబంధించి సమాచారాన్ని సేకరించనున్నారు.ఈ సర్వే రెండు నెలల పాటు నిర్వహించనున్నారు.
దేశంలోనే ప్రప్రథమం : కన్నబాబు, పురపాలక రాష్ర్ట సంచాలకులు
పట్టణాలను అన్ని విధాలుగా అభివద్ధి చేయడానికి, భవిష్యత్తులో సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ సమగ్ర సర్వే నిర్వహించనున్నాం. దేశంలోనే ప్రప్రథమంగా రాష్ర్టంలోని అన్ని పట్టణాల్లో దీన్ని నిర్వహించనున్నాం. కేంద్రీకత పర్యవేక్షణకు, అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి దోహదం చేస్తుంది. ప్రజలంతా సహకరించాలని కోరుతున్నాం. ఎక్కడా పన్నులు పెంచకుండానే ఆదాయం పెరిగేలా ఈ సర్వే ఉపకరించనుంది.