ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా దేశంలోని అన్ని వ్యవస్థలు నాశనం అవుతున్నాయని కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేసారు. మోడీ సర్కారు వ్యవహార శైలిపై నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన 'భారత్ బచావో' ర్యాలీలో ఆమె ప్రసంగిస్తూ, 'ఆర్థిక వృద్ధిని కోల్పోయాం. ద్రవ్యోల్బణం పెరుగుతూ వస్తోంది. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది. దేశ ప్రజలంతా స్పందించాల్సిన అవసరం వచ్చింది. ప్రజలు మౌనం వహిస్తే మన రాజ్యాంగాన్ని కూడా నాశనం చేస్తారు. చీకటిలో, భయంలో కూరుకుపోతాం. బీజేపీ-ఆర్ఎస్ఎస్ నేతలు అసత్యాలు ప్రచారం చేసుకుంటున్నారని ప్రియాంక వ్యాఖ్యానించారు.
'దేశ ఆర్థిక వ్యవస్థ పతనమైపోయింది.. నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. ఎన్నడూలేని విధంగా ధరలు విపరీతంగా పెరిగాయి. ధరలను అదుపు చేయాల్సిన ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోంది' అని ప్రియాంకా గాంధీ విమర్శలు గుప్పించారు.
దేశంలో విపరీత పరిణామాలు ఎన్ని జరుగుతున్నా, పాలకులలో ఎలాంటి మార్ప రావటంలేదని, సామాన్యులే ప్రభుత్వ నిర్వాకం కారణంగా పెరుగుతున్న ధరలకు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు ప్రియాంక.