ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కుట్రలు... వైసిపి నేత సంచలనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 14, 2019, 09:22 PM

విశాఖ స్టీల్  ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసే కుట్రలు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం  చేస్తోందని వైఎస్ఆర్‌సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు ఆరోపించారు. ఈ  కుట్రను దశలవారిగా అమలు చేస్తున్నారని...మొదటి దశలో భాగంగా  స్టీల్ ప్లాంట్ కు చెందిన భూమీని ఓ విదేశీ కంపనీకి కేటాయించారని తెలిపారు. స్వయంగా కేంద్ర మంత్రే ఈ విషయాన్ని ప్రకటించారని దాడి పేర్కొన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ కు చెందిన 3,400 ఎకరాల తీరప్రాంత భూమి దక్షిణ కొరియా సంస్థ పోస్కోకు కేటాయిస్తున్నామన్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటనను దాడి తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్రప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కితీసుకుని ప్లాంట్ భూమిని యాజమాన్యానికే అప్పగించాలని డిమాండ్ చేశారు.  లేదంటే మరో ఉద్యమాన్ని ఎదుర్కోడానికి సిద్దంగా వుండాలని హెచ్చరించారు.
గతంలో 68 గ్రామాల ఉత్తరాంధ్ర ప్రజలు తమ భూమిని త్యాగం చేస్తే ఓ 32మంది మాత్రం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసి స్టీల్ ప్లాంట్ ను సాధించుకున్నారని దాడి గుర్తుచేశారు. అలాంటిదాన్ని ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేస్తే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదన్నారు.  స్టీల్ ప్లాంట్ కొరకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం రూ. 4890 కోట్లు కేటాయిస్తే... కేంద్రానికి  స్టీల్ ప్లాంట్ పన్నుల రూపంలో చెల్లించిన మొత్తం రూ.40,500 కోట్లని తెలిపారు.విశాఖ అభివృద్దితో పాటు స్ధానికులకు ఉపాధి కల్పిస్తున్న ప్లాంట్ విషయంలో అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దని కేంద్రానికి దాడి సూచించారు.
పోస్కో కు స్టీల్ ప్లాంట్ లో 3400  ఎకరాల భూమి కేటాయింపు కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన సేబీ సంస్థ రెండు లక్షల కోట్ల విలువైన భూమికి కేవలం 4849 కోట్లు ధరనే నిర్ణయించింది. ఇలా అప్పనంగా విదేశ ప్రైవేటు సంస్థలకు భూమిని కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.
''విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఇనుప గనులు కేటాయించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వినిపించుకోలేదు. కానీ టాటా, జిందాల్ లాంటి ప్రైవేటు కంపెనీలకు మాత్రం కేటాయించారు. ప్రభుత్వ సంస్థ అయిన స్టీల్ ప్లాంట్ కు మాత్రం ఇనుప గనులు కేటాయించకుండా అన్యాయం చేశారు'' అని మండిపడ్డారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ కు చెందిన భూముల్లో విదేశీ కంపెనీలకు భూమిని కేటాయించడం అంటే స్టీల్ ప్లాంట్ ను నిర్వీర్యం చేయడమేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయంపై మరోసారి పునరాలోచించుకోవాలి. నిర్ణయాన్ని తక్షణం మార్చుకోకపోతే 1970 తరహాలో మరో మారు భారీ ఉద్యమం తప్పదని దాడి హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com