ముంబయి: ప్రైవేటు రంగ బ్యాంకు ఐసీఐసీఐ గృహ రుణాలు తీసుకున్న వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. అందుబాటు ధర ఇళ్ల కొనుగోలుకు తీసుకునే రుణాలపై వడ్డీరేట్లను 0.30శాతం తగ్గించింది. ఇటీవల ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా 0.25శాతం తగ్గించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గృహరుణాలపై 8.70శాతం వడ్డీరేటును వసూలు చేస్తున్న ఐసీఐసీఐ బ్యాంకు తాజా ఆఫర్లో మరింత వెసులుబాటును కల్పిస్తూ 0.30శాతం తగ్గించింది. కొత్తగా గృహరుణం తీసుకునే వారికి వడ్డీరేటు 8.40 శాతం మాత్రమే అవుతుంది. రూ.30లక్షలోపు రుణాలకు ఇది వర్తించనుంది. ఉద్యోగినులకు అతి తక్కువ 8.35శాతం వడ్డీరేటుకే రుణాలను అందించనుండగా, ఇతరులకు 8.40శాతంగా ఉంది.