తిరుమల, సూర్య ప్రత్యేక ప్రతినిధి : తొలి తెలుగు వాగ్గేయకారుడైన శ్రీ తాళ్ళపాక అన్నమయ్య శ్రీవేంకటేశ్వర స్వామి వారిపై రచించిన సంకీర్తనలను వినడం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం అలవడుతుందని టిటిడి పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య ఉద్ఘాటించారు. తిరుపతి లోని అన్నమాచార్య కళామందిరంలో జరుగుతున్న శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 609వ జయంతి ఉత్సవాలు శుక్రవారం రెండో రోజుకు చేరు కున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సాహితీ సదస్సుకు అధ్యక్షత వహిం చిన డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య ‘అన్నమయ్య ఆధ్యాత్మిక తత్వము’ అనే అంశంపై ఉపన్యసించారు. మోక్ష సాధనకు భక్తి, జ్ఞాన, కర్మ, యోగ మార్గాలని, వీటిలో భక్తి మార్గం అత్యంత సులభమైందని అన్నమయ్య తన సంకీర్తనల్లో తెలియజేశారని వివరించారు. జీవుడు దేవునికి దగ్గరై స్వామిలో ఐక్యం కావడానికి తోడ్పడే మహోన్నత సాధనం భక్తి అన్నారు. భగవంతునిపై ఎడతెగకుండా నిరంతరం భక్తిని ప్రదర్శించాలని అన్నమయ్య ఉద్భోధించినట్లు తెలియజేశారు. భగవంతుడు, భక్తుడి మధ్య సంబంధాన్ని భాగవతం తెలియజేస్తుందని, అన్నమయ్య తన సంకీర్తనల్లో ఇదే విషయాన్ని వివరించారని తెలిపారు. అనంతరం తిరుపతికి చెందిన డాక్టర్ టి.జయప్రకాష్ అన్నమయ్య సంకీర్తనలపై ఆళ్వారుల ప్రభావం అనే అశంపై ఉపన్యసించారు. అన్నమయ్య సంకీర్తనలపై ఆళ్వారుల ప్రభావం మెండుగా ఉందన్నారు. 12 మంది ఆళ్వార్లు 4 వేల పాశురాలతో రచించిన నాళాయిర దివ్య ప్రబంధాన్ని అన్నమయ్య పూర్తిగా అధ్యయనం చేసినట్టు చెప్పారు. ఆళ్వార్ల తరహాలోనే అన్నమయ్య కూడా స్వామి, అమ్మవార్ల క్షేమాన్ని, శ్రేయస్సును కాంక్షించారని తెలిపారు. సాయం్త్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు టిటిడి ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ సంగీత సభ అలరించింది.
మహతి కళాక్షేంలో : తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో శుక్రవారం సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు హైదరాబాద్కు చెందిన డాక్టర్ వై.రమాప్రభ బృందం నామ సంకీర్తన కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో టిటిడి ప్రాజెక్టుల ఉపకార్యనిర్వహణాధికారి శారద, ఎఇఓ పద్మావతి, అన్నమాచార్య ప్రాజెక్టు రీసెర్చి అసిస్టెంట్ డాక్టర్ సి.లత, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.