ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ తెలిపింది. రాయలసీమ జిల్లాల్లో ఒక తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈరోజు గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు స్పష్టం చేసింది. నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. వాగులు, వంకలు, నదుల్లో భారీగా వర్షపు నీరు వచ్చే అవకాశాలున్నాయని తెలిపింది.