రాష్ట్రంలోని విభిన్నప్రతిభావంతులకు(వికాలాంగులు) యూనిక్ డిజబిలిటీ గుర్తింపు కార్డులను(స్మార్ట్ కార్డులు) జారీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. విభిన్న ప్రతిభా వంతులకు యుడిఐడి కార్డులు జారీ చేసే అంశంపై మంగళవారం అమరావతి సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో సిఎస్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు యూనిక్ డిజబిలిటీ గుర్తింపు కార్డులు జారీ చేసేందుకు గ్రామ,వార్డు సచివాలయాల ద్వారా వారి వివరాలను సేకరించి ఆన్లైన్ పోర్టల్ లో అప్ లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆ విధంగా సేకరించిన వివరాలన్నిటినీ పరిశీలించి ప్రభుత్వ ప్రవేట్ మెడికల్ కళాశాలల భాగస్వామ్యంతో సకాలంలో సర్టిఫికెట్లు జారీచేసి తదుపరి యుడిఐడి కార్డులు జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.ఇప్పటికే సదరమ్ సర్టిఫికెట్లు కలిగిన వారు మరలా ఇందుకోసం వివరాలను ఇవ్వాల్సిన అవసరం లేకుండా సెర్ప్ వద్ద ఉన్న డేటాను అంతటినీ నేరుగా యుడిఐడి కార్డులు జారీ చేసే కేంద్ర ప్రభుత్వ సంస్థకు పంపాలని సిఎస్ ఆదేశించారు. ఈ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకుగాను వైద్య ఆరోగ్య, పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలతో సమన్వయం చేసి వెంటనే ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని విభిన్న స్ర్తీ శిశు,ప్రతిభావంతుల సంక్షేమశాఖల ముఖ్య కార్యదర్శి దమయంతిని సిఎస్ సుబ్రహ్మణ్యం ఆదేశించారు.