బీహార్ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీవర్షాలు, వరదలతో డెంగీ, చికున్ గున్యా జ్వరాలు ప్రబలడంతో జనం అల్లాడుతున్నారు. లోతట్టుప్రాంతాలైన కంకర్ బాగగ్, గార్దిని బాగ్, డాక్ బంగ్లా, ఎస్ కె పురి ప్రాంతాల్లో మురుగునీటి సమస్యతో దోమలు వ్యాప్తి చెందటంతో డెంగీ జ్వరాలు ప్రబలాయి. డెంగీకి తోడు చికున్ గున్యా జ్వరాలు కూడా రోగులను వణికిస్తున్నాయి. పట్నా పరిసర ప్రాంతాల్లో 150 మందికి చికున్ గున్యా జ్వరాలు వచ్చాయి. వరదల అనంతరం డెంగీ, చికున్ గున్యా జ్వరాలు ప్రబలడంతో బీహార్ సీఎం వైద్యఆరోగ్యశాఖను అప్రమత్తం చేశారు. జ్వరాల బారిన పడిన రోగులకు చికిత్స అందించడంతోపాటు దోమలు వ్యాప్తి చెందకుండా డ్రెయినేజీని శుభ్రం చేయాలని సీఎం నితీష్ కుమార్ ఆదేశించారు. జ్వరాలు ప్రబలిన నేపథ్యంలో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా ఆసుపత్రిని సందర్శించి వైద్యులతో అత్యవసరంగా పరిస్థితులను సమీక్షించారు.