సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. కేబినెట్ నిర్ణయాలపై మధ్యాహ్నం 3 గంటలకు మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించనున్నారు. కొత్త సంక్షేమ పథకాల విధివిధానాలపై మంత్రివర్గంలో చర్చించారు. చేనేత కుటుంబాలకు వైఎస్సార్ చేనేత నేస్తం పేరుతో ఆర్థిక సాయంపై సమావేశంలో చర్చించారు. ఏడాదికి రూ.24వేలు ఆర్థిక సాయాన్ని అందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వైఎస్సార్ చేనేత నేస్తం పథకానికి రూ.216 కోట్ల ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఏటా డిసెంబర్ 21న చేనేత కుటుంబాలకు బ్యాంకు ద్వారా ఆర్థిక సాయం ప్రభుత్వం అందించనుంది. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.10వేలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించినట్లు తెలిసింది.