ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలీసుల ముందే.. తన బావను కత్తితో పొడిచి చంపిన యువకుడు

national |  Suryaa Desk  | Published : Tue, Oct 15, 2019, 12:42 PM

పోలీసుల సమక్షంలోనే పోలీస్‌ స్టేషన్‌లో ఓ యువకుడు తన బావను కత్తితో పొడిచి చంపిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. నల్లసపొర పోలీస్‌ స్టేషన్‌లో తన భార్య ఆత్మహత్యపై సోమవారం సాయంత్రం ఆకాష్‌ కొలేకర్‌ తన స్టేట్‌మెంట్‌ను నమోదు చేస్తున్న సమయంలో ఆయన బావమరిది రవీంద్ర కాలెద్‌ (25) ఒక్కసారిగా బావపైకి ఉరికి కత్తితో పొడిచిచంపాడు. శనివారం రాత్రి కొలేకర్‌ భార్య, రవీంద్ర సోదరి కోమల్‌ (20) సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భార్యాభర్తల మధ్య విభేదాలే కోమల్‌ ఆత్మహత్యకు కారణమని పోలీసులు చెబుతున్నారు. సూసైడ్‌ నోట్‌ లభించకపోవడంతో​ కోమల్‌ మృతిని ప్రమాద ఘటనగా పోలీసులు కేసు నమోదు చేశారు.


కాగా మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన కోమల్‌ కుటుంబ సభ్యులు మాత్రం ఆమె మృతిపై సందేహాలు వ్యక్తం చేశారు. కోలేకర్‌ స్టేట్‌మెంట్‌ నమోదు చేసే సమయంలో కోమల్‌ తల్లితండ్రులు, సోదరుడు రవీంద్ర పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. రవీంద్ర తనతోపాటు తెచ్చుకున్న కత్తితో కొలేకర్‌పై దాడి చేసి విచక్షణారహితంగా పొడవడంతో విస్తుపోయిన పోలీసులు బాధితుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. రవీంద్రపై హత్య కేసు నమోదు చేశామని ఆయనను కోర్టు ఎదుట హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. తన సోదరి మరణానికి బావ కొలేకర్‌ కారణమని, ఆయన వల్లే తమ సోదరి ఈ కఠిన నిర్ణయం తీసుకుందని రవీంద్ర ఆరోపించారని పోలీసులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com