తిరుపతిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి 6 గంటలు పడుతోంది. భక్తుల రద్దీ దృశ్య సర్వ, దివ్య, టైంస్లాట్ టెకెన్లను రద్దు చేశారు. వీఐపీ బ్రేక్ దర్శనాలకు ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు మాత్రమే పరిమితం చేశారు. తమిళులకు అత్యంత ముఖ్యమైన పెరటాసి నెల చివరి వారం కావడంతో తిరుమల భక్తజన సంద్రమైంది. వాహనాల్లోనూ, నడకమార్గంలోనూ భక్తులు ప్రవాహంలా కొండకు చేరారు. రెండు క్యూ కాంప్లెక్సులు నిండి.. క్యూలైన్లు దాదాపు మూడు కిలోమీటర్ల వరకు వెలుపలకు వచ్చింది.
శనివారం అర్ధరాత్రి ఏకాంతసేవ వరకు దాదాపు 95వేల మంది భక్తులు స్వామిని దర్శించుకోగా.. మరో లక్షన్నర మంది భక్తులు వెలుపల నిరీక్షిస్తున్నారు. క్యూలైన్లో భక్తులకు ఇబ్బంది కలగకుండా నిరంతరాయంగా అన్నపానీయాలు అందజేస్తున్నారు. రద్దీ పెరుగుతుండడంతో అధికారులు క్యూలైన్ల వద్ద ఉండి సమీక్షిస్తున్నారు. భక్తులకు స్వామి దర్శనం త్వరగా కలిగేందుకు ప్రయత్నిస్తున్నారు. గదులు దొరక్కా భక్తులు రోడ్లపైనే సేదతీరుతున్నారు.