అమరావతి : మూడేళ్లుగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అధిక ప్రాధాన్యం ఇచ్చామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలోని వివిధ శాఖల ముఖ్య అధికారులతో నిర్వహించిన సమావేశంలో సీఎస్ దినేశ్కుమార్ స్వాగతోపన్యాసం చేశారు. 7, 15 ఏళ్ల ప్రణాళికలను సీఎస్ వివరించారు. అలాగే నీతిఆయోగ్ సమావేశంలో చర్చకు వచ్చిన ప్రణాళికలపై వివరణ ఇచ్చారు. అనంతరం జాతీయ, రాష్ట్ర ప్రాథమ్యాలను ప్రణాళికా విభాగం కార్యదర్శి సంజయ్ గుప్తా వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఆర్థిక వనరుల ఏకీకరణ తీసుకువచ్చి ఫలితాలు సాధించినట్టు చెప్పారు. మూడేళ్లుగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకీ అధిక ప్రాధాన్యం ఇచ్చామనీ, ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలను ఆధార్తో అనుసంధానం చేశామని వివరించారు. స్మార్ట్పల్స్ సర్వే, పీపుల్స్ హబ్, ల్యాండ్ హబ్ అమలుచేసినట్టు చెప్పారు. ఐటీ-ఐవోటీ ఆధారిత కార్యక్రమాలు అమలు చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశేనన్నారు.