టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్ చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ప్రభుత్వ సిబ్బందితో అనుచితంగా మాట్లాడిన వ్యవహారంలో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఎంపీడీవో సిబ్బంది ఫిర్యాదుతో కూన రవి సహా 12 మందిపై కేసులు నమోదయ్యాయి. కూన రవికుమార్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. నిన్న మధ్యాహ్నం వరకు తన స్వగ్రామంలో ఉన్న రవి కుమార్ కేసు నమోదు అయినట్టు తెలియగానే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన్ను అరెస్ట్ చేసేందుకు జిల్లా పోలీసులు ప్రత్యేకంగా టీం లు ఏర్పాటు చేశారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూన రవికుమార్ అధికారులను హెచ్చరించినట్టు ఆరోపణలు ఉన్నాయి.
టీడీపీ కార్యకర్తలు తెచ్చిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకోకుండా నాటకాలు ఆడితే అధికారులను గదిలో వేసి చావగొడతా అని ఆయన వార్నింగ్ ఇచ్చారట. మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఉద్యోగులను అవమానించారని ఏపీ ఎన్జీఓ సంఘం నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించిన కూన రవికుమార్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు చర్యలు తీసుకోకపోవడం వల్లే పునరావృతం అవుతున్నాయని వారు చెబుతున్నారు. రవికుమార్పై చర్యలు తీసుకోకపోతే ఉద్యోగులమంతా మూకుమ్మడి సెలవుల్లోకి వెళతామని హెచ్చరిస్తున్నారు.