ప్రతిష్ఠాత్మక అమర్నాథ్ యాత్రలో అలజడి సృష్టించేందుకు పాక్ కుట్ర పన్నిందని భారత ఆర్మీ వెల్లడించింది. ఆ కుట్రను తాము సమర్థంగా తిప్పికొట్టామని ప్రకటించింది. దీనికి సంబంధించి పక్కా ఇంటిలిజెన్స్ సమాచారం అందడంతో సోదాలు చేపట్టి కుట్రను భగ్నం చేసినట్లు పేర్కొంది. ఈ మేరకు ఆర్మీ, పోలీసులు శుక్రవారం సంయుక్త మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. జమ్ముకశ్మీర్లో భారీగా భద్రతా దళాలు మొహరించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ మీడియా సమావేశం నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
‘‘పాక్, ఆ దేశ ఆర్మీ ప్రేరిత ఉగ్రవాదులు అమర్నాథ్ యాత్రలో అలజడి సృష్టించాలని యత్నించారు. దీనికి సంబంధించి మాకు నిఘా వర్గాల సమాచారం అందింది. దీంతో గాలింపు చర్యలు చేపట్టి విజయం సాధించాం’’ అని చినార్ కార్స్ప్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ దిల్లాన్ తెలిపారు. ఇందులో పాకిస్థాన్ ఆర్మీకి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. పాకిస్థాన్ ఆయుధ కర్మాగారంలో తయారైన మైన్లు లభించడం ఇందుకు సాక్ష్యమన్నారు. అమర్నాథ్ యాత్ర మార్గంలో అమెరికా ఎం-24 స్నిపర్ సహా పలు రైఫిళ్లు, ఈ మార్కు ఉన్న పలు మైన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టంచేశారు. దేశంలో అశాంతి నెలకొల్పే ఎలాంటి చర్యలైనా తాము సమర్థంగా తిప్పికొడతామని చెప్పారు. ప్రస్తుతం ఎల్వోసీ వద్ద పరిస్థితి అదుపులోనే ఉందని వెల్లడించారు. టెర్రరిస్టులుగా మారిన వారిలో 83 శాతం మంది.. గతంలో రాళ్లు రువ్విన చరిత్ర ఉన్నవాళ్లేనని ఆర్మీ పేర్కొంది.