పాల ఉత్పత్తులను జాతీయ భద్రతా చట్టం పరిధిలోకి తెచ్చింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. దేశంలో మొదటిసారిగా ఈ నిర్ణయం తీసుకుంది ఆ రాష్ట్రమే. ఎందుకంటే, ఇప్పటి దాకా ఆ చట్టం పరిధిలోకి ఉగ్రవాదుల కదలికలు, సంఘ, దేశ విద్రోహులు మాత్రమే ఉండేవారు. కానీ పాల ఉత్పత్తులను ఆ చట్టం పరిధిలోకి తేవడం వెనుక బలమైన కారణం ఉన్నట్లు తేలింది. అటవీ, లోయ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న గ్వాలియర్, చంబల్ కేంద్రాలుగా పాల మాఫియా కార్యకలాపాలు సాగిస్తోందన్న కేంద్ర డ్రగ్స్ కంట్రోల్ అధికారులు, ఆరోగ్య భద్రత అధికారులు హెచ్చరించడంతో, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, మీగడ వంటి 225 ఉత్పత్తులను కేంద్ర డ్రగ్స్ అండ్ కెమికల్ విభాగానికి పంపిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం, ఈ ఉత్పత్తులు సింథటిక్, కెమికల్స్ వంటి ప్రమాదకర పదార్థాలతో తయారు చేసినట్లు గుర్తించింది. మాఫియా మీద ఉక్కు పాదం మోపేందుకే పాల ఉత్పత్తులను జాతీయ భద్రతా చట్టం పరిధిలోకి తచ్చామనేది ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తులసీ రామ్ సిలావత్ చెబుతున్న మాట. ఈ ప్రమాదకర పాల ఉత్పత్తులను తయార చేస్తున్న ముఠాలు, వ్యాపార సంస్థల మీద దాడుల కోసం స్పెషల్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం, ఇప్పటికే జబల్ పూర్ పరిధిలోని సాంచీ దుగ్ధ సంఘ్, సౌరభ్ డైరీలను సీజ్ చేసింది. అసవరం అయితే పాల మాఫియాను తుడిచి పెట్టేందుకు కేంద్ర బలగాల సాయం తీసుకునేందుకు కూడా తాము వెనకాడమని ఎంపీ సీఎం కమల్ నాథ్ స్పష్టం చేస్తున్నారట.
ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోడానికి పలు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలోని అన్ని ప్రాంతాలకూ మధ్యప్రదేశ్ నుంచి రవాణా సౌకర్యం ఉంది. దీంతో ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్, ఒడిశాలతో పాటు కేరళ, తమిళనాడుల్లో కూడా ఈ పాల మాఫియా విస్తరించిందట. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పాల ఉత్పత్తుల పేరిట అవుట్ పోస్టులు కూడా ఈ పాల మాఫియా ఏర్పాటు చేసినట్లు ఎంపీ ప్రభుత్వం తెల్సుకుంది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించిన మధ్యప్రదేశ్ అధికారులు, ఇతర రాష్ట్రాల నుంచి ఆరోపణలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. వీలైనంత వేగంగా పాల మాఫియాను అడ్డుకోకపోతే, రాష్ట్రంలో రాజకీయ అస్థిరత ఏర్పడుతుందనీ, అది తమ ప్రభుత్వానికే ఇబ్బందిగా మారే అవకాశం ఉన్నట్లు ఇప్పుడు కమల్ నాథ్ సర్కార్ భయపడుతోంది. అందుకే తమ రాష్ట్రంలో పాల ఉత్పత్తులను జాతీయ భద్రత చట్టంలోకి తీసుకు వచ్చింది.