వరదలతో అసోం అతలాకుతలమవుతోంది. బ్రహ్మపుత్ర నది ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తోంది. అసోం రాష్ట్రంలోని 33 జిల్లాలుండగా వీటిలో 30 జిల్లాల్లో వరదనీరు ముంచెత్తింది. కజిరంగ జాతీయ పార్కు జలదిగ్బంధంలో చిక్కుకుంది. పొబితోరా అభయారణ్యం, మానాస్ జాతీయ పార్కు జలమయం అయ్యాయి. 4 వేల 157 గ్రామాలు ముంపుకు గురయ్యాయి. 42.87 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లక్షా 53 వేల 211 హెక్టార్ల పంట నీట మునిగింది. వరదల కారణంగా మృతుల సంఖ్య 15కి చేరింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
నిలిచిపోయిన రాకపోకలు
అసోంలోని చిరాంగ్ జిల్లాలో పరిస్థితి మరింత విషమించింది. చాలా గ్రామాలు నీట మునగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని చోట్ల అధికారులు గ్రామస్థులను బలవంతంగా ఖాళీ చేయించారు. ఇళ్లలోకి నీరు చేరడంతో పెట్టే బేడా సర్దుకుని గ్రామస్థులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. అధికార యంత్రాంగం సరైన చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నీటిలో కొట్టుకుపోయిన జింకలు
వరదలతో ప్రజల పరిస్థితులు దారుణంగా మారాయి. ఎటు చూసిన నీరే కనిపిస్తోంది. ఏం చేయాలో తెలియని ప్రజలు.. తాము ఉంటున్న ఇంటిపైకి ఎక్కి..ప్రాణాలు చేత పట్టుకొని సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అస్సాంలోని పలు పార్కుల్లో కూడా వరదల కారణంగా ఎక్కడ చూసిన నీరు నిల్చింది. దీంతో... పార్కుల్లోని మూగ జీవాలు బిక్కు బిక్కు మని సహాయం కోసం ఎదురు చూస్తున్నాయి. అస్సాంలోని కజిరంగా పార్క్లో వరద ప్రవాహం ఎక్కువుగా ఉండడంతో జింకలు నీటిలో కొట్టుకుపోతున్నాయి.