ఎంసెట్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లను ఉన్నత విద్యామండలి పూర్తిచేసింది. ఈ ఏడాది ఎంసెట్కు రాష్ట్రవ్యాప్తంగా 2,82,633 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్కు 1,95,723, అగ్రికల్చర్, మెడికల్కు 86,910 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 115 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 109, హైదరాబాద్లో రెండు విభాగాలకు 6 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి రోజు రెండు సెషన్ల చొప్పున 24 వరకు ఏడు సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు.
20,21,22,23 తేదిల్లో ఇంజనీరింగ్ విద్యార్ధులకు 23,24 తేదిల్లో అగ్రికల్చర్ విద్యార్ధులకు పరీక్ష జరగనుంది.ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30గంటల వరకు రెండో సెషన్ జరుగుతాయి.ప్రతి సెషన్లో 29వేల మందికి పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాలని,నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదని ఎంసెట్ కన్వీనర్ సిహెచ్ సాయిబాబు తెలిపారు.
పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు గోరింటాకు, మెహందీ, ఇతర రంగులను చేతి వేళ్లకు లేకుండా చూసుకోవాలని తెలిపారు.హాల్ టిక్కెట్తో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డు గెజిటెడ్ అధికారిచే అటెస్టేషన్తో కూడిన ఆన్లైన్ దరఖాస్తు ను విద్యార్థులు తప్పనిసరిగా తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు.ఎస్సి,ఎస్టీ విద్యార్ధులకు కుల ధృవీకరణ పత్రం చూపించాల్సి ఉంటుంది. ఆన్లైన్ విధానంలో జవాబులను నిర్దేశించిన సమయంలో ఎన్నిసార్లయినా విద్యార్ధులు మార్చుకోవచ్చు.
దరఖాస్తులో పేర్కొన్న మెయిల్ ఐడికి విద్యార్ది ప్రశ్నాపత్రాన్ని, రెస్పాన్స్ షీట్ను పంపుతారు.ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ప్రాథమిక ‘కీ’ను ఈ నెల 23న, అగ్రికల్చర్, మెడికల్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ ఈ నెల 24న వెబ్సైట్లో పొందుపరుస్తారు.కీపై సందేహాలు ఉంటే ఇంజనీరింగ్ అభ్యర్ధులు ఈ నెల 26లోపు, అగ్రికల్చర్, మెడికల్ అభ్యర్ధులు 27లోపు నిర్దేశించిన ఫార్మెట్లో వెబ్సైట్లో పొందుపరిచిన మెయిల్ ఐడికి పంపించాల్సి ఉంటుంది.
ఫలితాలు మే రెండో వారంలో విడుదల చేసేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తుంది.సందేహాల నివృతి కోసం విద్యార్ధులు, తల్లిదండ్రులు 0884-2340535,2356255 ఫోన్ నంబర్ల ద్వారా గానీ, 2019apeamcet@gmail.com మెయిల్ ద్వారా గానీ సంప్రదించవచ్చు