మదనపల్లి: చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్ జగన్ చంద్రబాబు ఐదేళ్ల పాలన అంతా అబద్దాలు, మోసాలేనన్నారు. గ్రామగ్రామానికి బెల్ట్ షాపులు, దళారీలు పెంచి.. రౌడీలతో రౌడీయిజం.. హత్యా రాజకీయాలేనన్నారు. పట్టపగలు ఆడపిల్లలు బయటకి వెళ్లే పరిస్థితి కూడా ఐదేళ్లలో రాష్ట్రంలో లేకుండా చేశారన్నారు. ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్లి ప్రతి అక్క, ప్రతి చెల్లల్లకు చెప్పండి.. మరో నెలరోజులు ఆగితే జగన్ ముఖ్యమంత్రి అయితే అందరికీ అండగా ఉంటాడని చెప్పాలన్నారు. గడప గడపకి వెళ్లి నవరత్నాల వలన ప్రతి వ్యక్తికి ఎంత మేలు జరుగుతుందో వివరించి చెప్పాలన్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ, రైతులకు భరోసా, పిల్లలను బడికి పంపితే తల్లికి పదిహేను వేలు, వృద్ధులకు మూడువేల పెన్షన్లు, కుటుంబానికి ఏడాదికి డెబ్భై ఐదువేల రూపాయలు.. ప్రతి ఒక్కరిని ఆదుకుంటామన్నారు. వైఎస్ జగన్ తాను అధికారంలోకి రాగానే గృహరుణాలను మాఫీ చేస్తామన్నారు. చంద్రబాబు హయంలో ఎన్టీఆర్ గృహ పథకం క్రింద అపార్ట్ మెంట్లు కట్టించి ప్లాట్లను కేటాయించగా ఒక్కో ప్లాటుకు మూడు లక్షల రూపాయలు అప్పుగా నమోదు చేశారు. ఆ అప్పును జగన్ అధికారంలోకి రాగానే మాఫీ చేస్తామన్నారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఎలాంటి అభివృద్ధి లేదని.. పిల్లలను చదివించడానికి ఆస్తులను నమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని.. రుణమాఫీ హామీ నెరవేర్చలేదని..కనీసం 108 కూడా తిరిగే పరిస్థితి లేదని, ఆడపడుచుల నెత్తిన కూడా అప్పులు, వైద్యం కోసం నానా యాతన పడుతున్నా చంద్రబాబు మనసు కరగడం లేదన్నారు. ప్రతి పేదవాడికి అండగా ఉంటానని హామీ ఇస్తున్నానని.. రాష్ట్రంలో ప్రతిపేదవాడికి అండగా ఉంటానని జగన్ హామీలు గుప్పించారు.