కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికలపై చేసిన ప్రకటన బీజేపీ నేతల్లో గందరగోళాన్ని నింపింది. ‘అసెం బ్లీ, పార్లమెంటు స్థానాల టికెట్లు ఆశిస్తున్నవారి వివరాలన్నీ(బయోడేటా) పది రోజుల్లో తీసుకోవాలి. శ్రీకాకుళంలో ఆగిపోయిన బస్సుయాత్రను తిరిగి ప్రారంభించాలి. ఏప్రిల్ 30 లేదా మే 6న పోలింగ్ ఉంటుంది. దీనికి అనుగుణంగా పార్టీ సిద్ధమవ్వాలి’… గడిచిన రెండు రోజులుగా తిరుపతిలో రాష్ట్ర బీజేపీ సమావేశాల్లో జరుగుతున్న చర్చ ఇది. ఆదివారం తిరుపతిలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో సైతం ఇవే విషయాలు చర్చకు వచ్చాయి. అందుకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. కానీ సాయంత్రం ఐదు గంటల తర్వాత మొత్తం ప్లాన్ తారుమారైంది! బస్సుయాత్ర సైతం రద్దు చేసుకుని బయోడేటాలు సేకరించే పని చేపట్టారు. దేశంలో అధికారంలో ఉన్న పార్టీ అయినా రాష్ట్రంలో మాత్రం బీజేపీది చాలా దుర్భర పరిస్థితి.
గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పె ట్టుకున్న బీజేపీ… 4 పార్లమెంటు, 13 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. కానీ నాలుగు అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాల్లోనే విజయం సాధించింది. అప్పట్లో బీజేపీ ఇచ్చిన ప్రధాన హామీల్లో ప్రత్యేక హోదా కీలకమైంది. కానీ, హోదా ఇవ్వలేదు. ఇతర విభజన హామీలను కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని టీడీపీ, ఇతర విపక్షాలతోపాటు ప్రజా సంఘాలు సైతం బీజేపీని టార్గెట్ చేయడంతో ఏపీ ప్రజల్లో ఇప్పుడు కమ లం అంటరానిదైంది. బీజేపీకి ఏపీలో పోటీకి అ భ్యర్థులు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఇటీవల గుంటూరు, విశాఖలో సభలు ఏర్పాటు చేసి ప్రధానమంత్రిని రప్పించగలిగిన కమలద ళం… ఎలాగైనా అభ్యర్థులను బరిలో దిం చాలని భావించింది. అందుకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకుని ఈ నెలాఖరులోపు అన్నీ చక్కదిద్దాలని, అంతకు ముందు బస్సుయాత్రను తిరిగి ప్రారంభించాలనుకుంది.కానీ, ఏప్రిల్ 11నే రాష్ట్రంలో ఒకే దశలో ఎన్నికలు పూర్తి చే యాలన్న ఎన్నికల సంఘం నిర్ణయం బీజేపీ నే తలకు ఒకరకంగా షాక్ ఇచ్చింది! వీలైనంత త్వరగా అభ్యర్థుల వివరాలు తీసుకుని ఢిల్లీకి పంపే కసరత్తు ప్రారంభించనుంది. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చిందో వివరిస్తూ శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి బస్సుయాత్ర చేపట్టిన బీజేపీ నేతలకు ఆది నుంచీ ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వచ్చి పలాసలో బస్సుయాత్రకు జెండా ఊపారు. అక్క డ ఏర్పాటు చేసిన సభకు జనం లేకపోవడంతో సభ రద్దయింది. అక్కడి నుంచి శ్రీకాకుళం వర కూ వచ్చిన బస్సుయాత్ర… ఆ తర్వాత గుంటూరులో ప్రధానమంత్రి మోదీ సభ నేపథ్యంలో ఆగింది.
ఆ తర్వాత విశాఖపట్నంలో సభకు ఏర్పాట్లు, ఇతరత్రా కార్యక్రమాల వల్ల బస్సుయా త్ర శ్రీకాకుళం నుంచి ముందుకు కదల్లేదు. ఎన్నికల షెడ్యూల్తో బస్సుయాత్ర ఇక రద్దయినట్లేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఎంపీ అభ్యర్థులను నిలపగలిగేందుకు రాష్ట్ర బీజేపీకి అవకాశం ఉన్నా… ఎమ్మెల్యే స్థానాలకు అసాధ్యంగా కనిపిస్తోంది. జిల్లాకు ఒకరిద్దరైనా ఓ పదివేల ఓట్లు తెచ్చుకునే వ్యక్తుల్లేరని పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. రాయలసీమ జిల్లాల్లో మరింత దారుణంగా ఉండడంతో బీజేపీ పరిస్థితి ఇబ్బందుల్లో పడింది.