జమ్మూకశ్మీర్ పుల్వామా ఘటన నేపథ్యంలో భారత్ తమతో యుద్ధం చేయాలనుకుంటే తాము సిద్ధమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు పాక్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ కూడా మన దేశంపై నోరుపారేసుకున్నాడు. పాకిస్తాన్ జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, తీవ్ర పదజాలం వాడాడు. పాక్ను వక్ర దృష్టితో చూస్తే కళ్లు పీకేస్తాం అని ఓ వీడియో ద్వారా హెచ్చరికలు చేశాడు. అందులో ఏముందంటే.. ‘ఇమ్రాన్ ఖాన్ స్పష్టంగా చెప్పారు. మనసులో దుష్ట తలంపుతో పాకిస్తాన్ వైపు తేపారి చూస్తే వాళ్ల కళ్లు పీకేస్తాం. ఆ తర్వాత పక్షులు కిలకిలరావాలూ ఉండవు, ఆలయాల్లో గంటలూ మోగవు’ అంటూ రషీద్ వ్యాఖ్యలు చేశాడు. ఆలయాలు అనే పదాన్ని వాడి, భారత్కు పరోక్ష సంకేతంగా అహ్మద్ హెచ్చరికలు జారీ చేశాడు.