ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వీడిన జ్యోతి మర్డర్ మిస్టరీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 18, 2019, 01:06 PM

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన జ్యోతి హత్య కేసును గుంటూరు పోలీసులు చేధించారు. ముందుగా అనుమానిస్తున్నట్లుగానే జ్యోతిని ఆమె ప్రియుడు శ్రీనివాసే హత్య చేసినట్లు నిర్ధారించారు. జ్యోతిని ప్రేమ పేరుతో లొంగదీసుకున్న శ్రీనివాస్.. ఆమె పెళ్లి చేసుకోవాలని కోరడంతోనే స్నేహితుడి సాయంతో హతమార్చినట్లు తేల్చారు. జ్యోతి కాళ్లు చేతులను శ్రీనివాస్ పట్టుకోగా.. అతడి ఫ్రెండ్ పవన్ ఆమె తలపై బలంగా కొట్టాడని పోలీసులు తెలిపారు. తీవ్ర రక్తస్రావంతో జ్యోతి అక్కడికక్కడే చనిపోగా, ఎవరికీ అనుమానం రాకుండా శ్రీనివాస్ తన తలపైన కూడా పవన్‌తో కొట్టించుకున్నాడని పోలీసులు వెల్లడించారు. 


పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా తాడేపల్లి మహానాడుకు చెందిన చుంచు శ్రీనివాసరావు (26), అంగడి జ్యోతి (24) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మనస్పర్ధల కారణంగా కొన్ని నెలల పాటు శ్రీనివాసరావుకు దూరంగా ఉన్న జ్యోతి మళ్లీ ఇటీవలే దగ్గరైంది. అయితే జ్యోతిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని శ్రీనివాస్.. ఆమెను శారీరకంగా వాడుకుంటూనే పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చాడు. దీంతో జ్యోతి ఇటీవల శ్రీనివాస్‌ను గట్టిగా నిలదీసింది. దీంతో జ్యోతి అడ్డు తొలగించుకోవాలనుకున్న శ్రీనివాస్ ఆమెను మంగళగిరి సమీపంలోని ఉడా టౌన్‌షిప్ సమీపానికి తీసుకెళ్లి ఫ్రెండ్ సాయంతో హతమార్చాడు. 


జ్యోతిని హత్య చేయడానికి ముందు ఆమె నగ్న వీడియోలతో శ్రీనివాసరావు బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పెళ్లికి ఒత్తిడి చేస్తే తన దగ్గరున్న నగ్న ఫోటోలను సోషల్‌మీడియాలో పెడతానని బెదిరించినా జ్యోతి వెనక్కి తగ్గలేదని, అందుకే ఆమెను అంతం చేశాడని పోలీసులు నిర్ధారించారు. శ్రీనివాస్ గతంలోనూ ఇదే ప్రదేశానికి కొంత మంది యువతులను తీసుకెళ్లి నగ్న వీడియోలు చిత్రీకరించినట్లు తమ విచారణలో వెల్లడైందన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com