ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆస్ట్రేలియాతో రెండు టీ20లకు జట్టులో చోటు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 16, 2019, 11:05 AM

ఆస్ట్రేలియాతో రెండు టీ20లు, ఐదు వన్డేల సిరీస్‌కు భారత్ జట్టును ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 15 మందితో కూడిన భారత జట్టుని బీసీసీఐ సెలక్టర్లు ప్రకటించారు. తొలి రెండు వన్డేలకు, చివరి మూడు వన్డేలకు, రెండు టీ20లకు ప్రత్యేకంగా జట్లను ప్రకటించింది. న్యూజిలాండ్‌ పర్యటనకు మధ్యలోనే దూరమైన టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ, బుమ్రా ఈ మ్యాచ్‌లకు తిరిగి జట్టులో చేరారు. దీంతో విరాట్‌ కోహ్లీ తిరిగి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనుండగా, రోహిత్‌ శర్మను వైస్‌ కెప్టెన్‌గా నియమించారు.ఫిబ్రవరి 24న విశాఖపట్నంలో జరిగే తొలి టీ20తో భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటన ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగనున్న టీ20 సిరీస్‌కి భారత జట్టులో ఓ కొత్త కుర్రాడు చేరాడు. పంజాబ్‌కు చెందిన 21 ఏళ్ల యువ లెగ్‌ స్పిన్నర్‌ మయాంక్‌ మార్కండేను టీ20 సిరీస్‌కు ఎంపికచేశారు. ఆసీస్‌తో రెండు టీ20లకు చైనామన్ కుల్దీప్ యాదవ్‌కు విశ్రాంతి ఇచ్చిన సెలక్టర్లు అతడి స్థానంలో పంజాబ్ లెగ్ స్పిన్నర్ మార్కండేకు జట్టులో చోటు కల్పించారు. ఈ నేపథ్యంలో ఎవరీ మయాంక్ మార్కండే అన్న ప్రశ్న సగటు క్రికెట్ అభిమాని మదిలో మెదులుతోంది.


 


జూనియర్ స్థాయి నుంచే మార్కండే బౌలింగ్‌లో అందరి దృష్టిని ఆకర్షించాడు. పంజాబ్‌కు చెందిన మయాంక్ మార్కండే 2013-14 సీజన్‌లో విజయ్ మర్చంట్ ట్రోఫీలో 18.24 యావరేజితో మొత్తం 29 వికెట్లు తీశాడు. అండర్-16 జట్టు తరుపున కేవలం 7 మ్యాచ్‌ల్లోనే మార్కండే ఈ వికెట్లను పడగొట్టడం విశేషం.ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మార్కండే తన కెరీర్‌ను ఫాస్ట్ బౌలర్‌గా ప్రారంభించాడు. ఆ తర్వాత తన కోచ్ సూచన మేరకు లెగ్ స్పిన్నర్‌గా మారాడు. లెగ్ స్పిన్‌లో మార్కండే వెపన్ ఏంటంటే గూగ్లీ. విజయ్ హాజారే టోర్నీలో భాగంగా ఫిబ్రవరి 7న హర్యానాతో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు.ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోఅడుగుపెట్టిన ఏడాదే హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. ఇప్పటివరకు 7 మ్యాచ్ లాడిన మార్కండే ఇప్పటివరకు 10 వికెట్లు పడగొట్టాడు. పంజాబ్ తరుపున లిస్ట్-ఏ క్రికెట్‌లో 2017-18 సీజన్‌లో టీ20ల్లో అరంగేట్రం చేశాడు. టీ20ల్లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లాడిన మార్కండే మొత్తం ఐదు వికెట్లు తీసుకున్నాడు.


 


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గతేడాది మొత్తం 14 మ్యాచ్‌లాడిన మార్కండే 15 వికెట్లు తీశాడు. దీంతో ఐపీఎల్ 2019 సీజన్‌లో భాగంగా ముంబై ఫ్రాంఛైజీ మార్కండేను తన వద్ద అట్టిపెట్టుకుంది. మే చివరి వారంలో వన్డే వరల్డ్‌కప్ ప్రారంభమవనున్న నేపథ్యంలో కొత్తవాళ్లను తీసుకోకపోవచ్చని క్రికెట్ విశ్లేషకులు భావించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com