రాజధాని అమరావతి నిర్మాణానికి విరాళాలు ఇచ్చే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. అసలు పునాదులు పడలేదు, ఇటుక వేయలేదంటూ విమర్శించే విపక్షాల మాటల్ని తిప్పి కొట్టేలా, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు అమరావతి, పోలవరం సందర్శించి వాస్తవాలు తెలుసుకునేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో అమరావతి దర్శించిన అనేక మంది ప్రభుత్వం శరవేగ నిర్మాణాలకు అచ్చెరువొంది కేంద్ర సహాయం అంటం లేదన్న విషయాన్ని గుర్తించి తాము సైతం విరాళాలిచ్చేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే గుంటూరు కు చెందిన మాజీ సైనికులు వెలగపూడి రత్తయ్య, వరలక్ష్మి దంపతులు తమకు వస్తున్న పింఛన్ మొత్తాన్ని రాజధాని నిర్మాణానికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం ఉండవల్లిలోని ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలసుకున్న ఈ దంపతులు రూ. 1, 11, 116 చెక్కును అందజేశారు. అలాగే రాజధాని నిర్మాణానికి తనవంతు సహాయంగా గుంటూరు వాసి నిమ్మగడ్డ అంకమ్మ చౌదరి 10 వేలు విరాళంగా అందజేశారు.