ప్రతిసారి ఎన్నికలు జరిగే సమయంలో పార్టీలు మారడమనేది ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాసరావులకు వెన్నతో పెట్టిన విద్య అని ఏపీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తీవ్రస్ధాయిలో విమర్శించారు. కాపుల సంక్షేమం కోసం కృషి చేస్తూ కాపు కార్పోరేషన్కు రూ.4 వేల కోట్లను కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విమర్శించే నైతిక అర్హత ఆమంచికి, అవంతికి లేదని ఆయన గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాపుల రిజర్వేషన్లకోసం పాటు పడుతున్న చంద్రబాబును వదిలి రిజర్వేషన్లు సాధ్యం కాదన్న వైసీపీ నాయకుడు జగన్తో జత కట్టడం వారి రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. గత ఐదేళ్లుగా తెలుగుదేశం పార్టీలో కొనసాగి ముఖ్యమంత్రితో ఎన్నో పనులు చేయించుకున్న ఆమంచికి సిగ్గులేదని, అవంతికి విశ్వాసం లేదని చినరాజప్ప ధ్వజమెత్తారు. తరచు పార్టీలు మారే నైజం కలిగిన ఆమంచి, అవంతిలకు కాపుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమం విషయంలో నిన్నటివరకు చంద్రబాబు నాయుడును మెచ్చుకున్న అవంతి నేడు మాట మార్చి ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడమనేది దిగజారుడుతనాన్ని రుజువు చేస్తోందని పేర్కొన్నారు