ప్రధాని మోదీని ఇంటికి పంపించాల్సిన తరుణం ఆసన్నమైందని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ అన్నారు. కోల్కతాలోని బ్రిగేడ్ మైదానంలో నిర్వహించిన విపక్షాల ఐక్యతా ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2019 సార్వత్రిక ఎన్నికలు దేశంలో రెండో స్వాతంత్ర్య పోరాటానికి నిదర్శంగా నిలుస్తాయన్నారు. ‘మతవాద పోకడల నుంచి దేశానికి విముక్లి కల్పించేందుకు సాగుతున్న పోరాటమిది. భాజపాను ఓడించండి.. మోదీని గద్దె దించండి దేశాన్ని కాపాడండి.. ఇదే మన నినాదం. మహాకూటమి చేతిలో ఎక్కడ ఓడిపోతామోనని భాజపా భయపడుతోంది. అందుకే ప్రతిసారి విపక్షాలను విమర్శించడమే పనిగా పెట్టుకుంది. మోదీకి వ్యతిరేకంగా ఎందుకు ముందుకెళ్తున్నారని చాలా మంది నన్ను ప్రశ్నించారు. మోదీ విధ్వంసకర విధానాలకు మాత్రమే నేను వ్యతిరేకం. అంతేకానీ వ్యక్తిగతంగా ఎటువంటి వ్యతిరేకం లేదు’ అని స్టాలిన్ పేర్కొన్నారు.
ప్రధాని మోదీ మమతకి మాత్రమే భయపడుతున్నారని స్టాలిన్ ఎద్దేవా చేశారు. అందుకే మోదీ, అమిత్షా పశ్చిమ్బంగ వచ్చేందుకు భయపడతారని అన్నారు. నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చి దేశాన్ని 50ఏళ్ల వెనక్కి తీసుకెళ్లారని ఆయన విమర్శించారు. దేశాన్ని కాపాడుకునేందుకు విపక్షాలంతా ఏకమవ్వాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో స్టాలిన్ గెలుపు తథ్యమని, అందుకే ముందస్తుగా శుభాకాంక్షలు తెలుపుతున్నానని మమతా బెనర్జీ అన్నారు. స్టాలిన్ ప్రసంగం ముగిసిన తర్వాత దీదీ కృతజ్ఞతలు చెబుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. స్టాలిన్ తమిళంలో ప్రసంగం చేస్తుండగా.. మరొకరు ఆయన మాట్లాడిన దాన్ని బెంగాలీలోకి తర్జుమా చేశారు.