విజయవాడ: పోలవరం ప్రాజెక్టుపై వైసీపీ అధినేత జగన్ చేసిన విమర్శలకు మంత్రి దేవినేని ధీటుగా బదులిచ్చారు. జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యలు ఉత్తరకుమారుడిలా ఉన్నాయని, పోలవరం ప్రాజెక్టు పనులు రాజశేఖర్ రెడ్డి, జగన్ వల్లే ఆలస్యం అయ్యాయని దేవినేని ఆరోపించారు. ఇదే సందర్బంగా గతంలో సీఎం చంద్రబాబు దివంగత సీఎం వైఎస్ చేసిన సవాల్ ను గుర్తుచేశారు. పోలవరంను ఐదేళ్లలో పూర్తి చేయగలిగితే సభలోనే వైఎస్ కు సన్మానం చేస్తానని చంద్రబాబు చేసిన ప్రకటనను గుర్తుచేశారు. ఆ తర్వాతి కాలంలో వెయ్యి కోట్ల రూపాయలు, పవర్ ప్రాజెక్టు కొట్టివేయాలన్న ఉద్దేశంతో వైఎస్ పనులు ప్రారంభించారని విమర్శించారు. అదే సమయంలో 2019వరకు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని బల్ల గుద్ది మరీ దేవినేని స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం పోలవరం పూర్తిచేస్తే వైసీపీకి పుట్టగతులుండవు అని విమర్శించారు.