ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయోధ్య గర్భగుడి ఫోటోలు విడుదల.. రాముడు కొలువుదీరనున్న ప్రాంతం ఎలా ఉందంటే?

national |  Suryaa Desk  | Published : Sat, Dec 09, 2023, 08:21 PM

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులు ఎప్పుడెప్పుడా అని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న శుభ తరుణం రానే వస్తోంది. మరో నెల రోజుల్లో అయోధ్య రామాలయంలో రాముడి విగ్రహం ప్రతిష్టించనున్నారు. అయితే ఇప్పటికే రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయ పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి. ఈ క్రమంలోనే అయోధ్య రామాలయ గర్భగుడికి సంబంధించిన ఫోటోలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ విడుదల చేశారు.


2024 జనవరి 22 వ తేదీన ఆలయ ప్రారంభోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలోనే ట్విటర్ వేదికగా రామాలయ గర్భగుడి ఫోటోలను ట్విటర్ వేదికగా చంపత్‌రాయ్‌ విడుదల చేశారు. శ్రీరామచంద్రమూర్తి ఆలయ మొదటి అంతస్తు పనులు దాదాపు పూర్తి అయినట్లు తెలిపారు. ఆలయ గర్భగుడి సైతం దాదాపు సిద్ధమైందని వెల్లడించారు. ఇటీవల లైటింగ్‌ పనులు సైతం పూర్తయినట్లు చంపత్‌రాయ్‌ పేర్కొన్నారు. మరోవైపు జనవరి 22 వ తేదీన అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించేందుకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మరో నెల రోజుల్లో ఆలయం ప్రారంభం కానుంది. రామమందిరం ప్రాణ ప్రతిష్ఠకు ప్రధాని నరేంద్ర మోదీ సహా 130 దేశాల ప్రతినిధులు హాజరు కానున్నారు.


రామ్ లల్లాను ఐదేళ్ల బాలుడి రూపంలో ఆలయంలో ప్రతిష్ఠించనున్నారు. రాముడి విగ్రహాన్ని తయారు చేసుకునేందుకు కర్ణాటక, రాజస్థాన్‌ల నుంచి తీసుకొచ్చిన శిలలతో 3 విగ్రహాలను తయారు చేశారు. రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్ సర్కార్ జనవరి 2024 లో రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో అఖండ రామాయణం, హనుమాన్ చాలీసా పారాయణాలను నిర్వహించనున్నారు. అయోధ్యలోని రామాలయం కోసం వినియోగించే ధ్వజ స్తంభాల నిర్మాణ పనులను అహ్మదాబాద్‌లోని అంబికా ఇంజినీరింగ్ వర్క్స్ కంపెనీ తయారు చేసింది. 7 ధ్వజ స్తంభాల బరువు సుమారు 5500 కిలోలు. రామమందిరం చుట్టూ 800 మీటర్ల పొడవున నిర్మిస్తున్న రింగ్ రోడ్డు చివరి దశలో ఉంది. అయోధ్య రామమందిరాన్ని 8.64 ఎకరాల్లో యూపీ ప్రభుత్వం నిర్మించింది.


2024 జనవరి 22 వ తేదీన అయోధ్యలోని నూతన రామాలయంలో శ్రీరాముడు కొలువుదీరనున్నాడు. ఆరోజు నుంచి 20 మంది కొత్త అర్చకులు ఆలయంలో రోజువారీ పూజలు చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రస్తుతం 20 మంది కొత్త అర్చకులకు శిక్షణ ఇస్తోంది. రామాలయ ప్రారంభోత్సవానికి వచ్చే భక్తుల కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు వసతి కోసం అయోధ్యలో టెంట్ సిటీలు ఏర్పాటు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com