ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 07, 2024, 09:47 PM

విజయవాడ వరదలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుధీర్ఘమైన పోస్టు పెట్టారు. విజయవాడలో వరదలు వచ్చి 8 రోజులు గడుస్తున్నా బాధితులకు ఇప్పటికీ దారీతెన్నూ లేదని వైఎస్ జగన్ ఆరోపించారు. ఇంకా ఆకలి కేకలు వినిపిస్తున్నాయని.. అసలు ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. వరదల కన్నా ప్రభుత్వ నిర్వాకాల వల్ల నెలకొన్న విషాదం, అసమర్థత వల్ల వచ్చిన నష్టం భారీగా ఉందని విమర్శించారు. 5 కోట్లమంది జనాభా, లక్షల కోట్ల బడ్జెట్‌ ఉన్న రాష్ట్రాన్ని నడుపుతున్న ప్రభుత్వం ఐదారు లక్షలమందిని ఉదారంగా ఆదుకోలేని దీన స్థితిలో ఉందా అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఇంత చేతగాని తనమా? ఇంతటి అమానవీయత మీకు మాత్రమే సాధ్యం చంద్రబాబు గారూ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.


మరోవైపు మూడు రోజుల్లో 30 సెం.మీ. పైగా వర్షం పడ్డం అసాధారణం ఏమీ కాదన్న వైఎస్ జగన్.. గతంలో చాలాసార్లు ఇలా పడిందని వివరించారు. కాని ఈ మాదిరిగా 50మందికిపైగా ప్రజలు చనిపోవడం ఎప్పుడూ జరగలేదని అన్నారు. బాధితులకోసం సహాయక శిబిరాలు ఏర్పాటు చేయకపోవడం, ఏర్పాటు చేశామని చెప్తున్నా అవి ఎక్కడున్నాయో తెలియకపోవడం, బాధితులను లోతట్టు ప్రాంతాలనుంచి సహాయక శిబిరాలకు తరలించకపోవడం అనేది టీడీపీ కూటమి ప్రభుత్వంలో మాత్రమే జరిగిందని ఆరోపించారు. వరదలు వచ్చి 8 రోజులు అవుతున్నా, నాలుగైదు రోజులుగా వర్షాలు లేకున్నా ఇంకా ప్రజలు నీటిలోనే సహాయం అందని పరిస్థితుల్లోనే ఉండడం చాలా దారుణమని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.


"అసలు ఇదంతా ఎందుకు జరిగింది? దీనికి కారణం మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం కాదా చంద్రబాబు గారూ? శుక్రవారం(ఆగస్టు 30) నుంచి భారీ వర్షాలు వస్తాయని, భారీగా వరద వస్తుందని మీకు బుధవారం రోజే (ఆగస్టు 28) అలర్ట్‌ వచ్చినా, అప్పటికే కృష్ణానదిపై ఉన్న జలాశయాలన్నీ పూర్తి సామర్థ్యంతో నిండుగా ఉన్నాయని తెలిసినా, అలాగే పైనుంచి, ఇతర రాష్ట్రాలనుంచి భారీగా వరద వస్తుందని సమాచారం ఉన్నా, బుధవారం నుంచి శుక్రవారం వరకూ రెండున్నరోజుల సమయం ఉన్నా మీరు పట్టించుకోలేదు. ఇరిగేషన్‌, రెవిన్యూ, హోం సెక్రటరీలతో రివ్యూ తీసుకుని వారికి బాధ్యతలు అప్పగించి దిశానిర్దేశం చేసి ఉంటే ఇంత ఘోరం జరిగిఉండేది కాదు కదా?" అంటూ జగన్ ట్వీట్ చేశారు.


మరోవైపు ముందే రివ్యూ చేసి.. కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్‌, పులిచింతల నుంచి నీటిని ముందుగానే విడుదలచేసి, తగ్గించుకుంటూ వస్తూ 60-70 టీఎంసీల ఫ్లడ్‌ కుషన్‌ ఏర్పాటు చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. పై నుంచి వచ్చిన వరదను తగ్గించకపోవడం వల్ల కృష్ణానదిలో భారీ ప్రవాహానికి పులిచింతల దిగువ వరద కూడా తోడయ్యింది. దీంతోపాటు బుడమేరు విషయంలో మీరు చేసిన నిర్వాకం వల్ల ఇంత విపత్తుకు దారితీసిందంటూ జగన్ ట్వీట్ చేశారు.


మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు ప్రచార ఆర్బాటాల వల్ల సహాయక చర్యల్లో పూర్తిగా సమన్వయం లోపం నెలకొందని వైఎస్ జగన్ ఆరోపించారు. " మీకూ, మీ కూటమి మంత్రి నాదెండ్లకూ మధ్య జరిగిన సంభాషణపై వైరల్‌ అయిన వీడియోనే దీనికి సాక్ష్యం. ట్రాక్టర్లు రాకపోవడం ఏంటి? 150 వాహనాలు మాత్రమే ఉండడం ఏంటి? 80వేల కుటుంబాలకు సరుకులు ఇవ్వాలనుకుంటే తొలిరోజు 15వేల మందికీ ఇవ్వలేకపోయారని స్వయంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మీరే బేలతనం చూపడం ఏంటి? వర్షాలు ఆగి 5 రోజులు అయిన తర్వాత కూడా మీరు ఎలాంటి పాలన చేస్తున్నారు? విపత్తుల సమయంలో అసమాన సేవలందించిన, గ్రామ-వార్డు సచివాలయాలు, వాలంటీర్‌ వ్యవస్థపై కక్షపెంచుకుని వాటిని నిర్వీర్యంచేయడం వల్ల ఈ పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తోందన్నది వాస్తవం కాదా?" అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.


బాధితులకు బియ్యం, పప్పు ఇవ్వడం ఇదే తొలిసారి అన్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారన్న వైఎస్ జగన్.. గతంలో తమ ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి వస్తే రేషన్‌ సరుకులను ఒక్కరోజులో ఎండీయూ వాహనాల్లో డోర్‌డెలివరీ చేశామని అన్నారు. మరోవైపు ఇన్నిరోజుల పాలనలో ఒక్క పథకం కూడా అమలు చేయని ప్రభుత్వం, వరద బాధితులకు సహాయం చేయడంలో బీద అరుపులు ఎందుకు? చివరకు విరాళాలు ఇవ్వాలని డ్వాక్రా అక్కచెల్లెమ్మెలదగ్గరనుంచి కూడా వసూళ్లకు దిగడం ఏంటి అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. బాధితులను ఆదుకోకపోతే వైసీపీ తరుఫున పోరాడతామని స్పష్టం చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com