ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పండగని మామిడాకులు కోస్తే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 07, 2024, 07:33 PM

వినాయక చవితి పండుగ రోజున అందరూ విఘ్నేశుడిని పూజిస్తారు. ఉదయాన్నే లేచి, తలస్నానం చేసి, ఇంటికి మామిడి తోరణాలు కట్టి.. గరిక, పత్రి సహా ఫలాలు ఉంచి ఆ గణేశుడిని ఆరాధిస్తారు. కృష్ణా జిల్లా యనమలకుదురుకు చెందిన ఓ వ్యక్తి కూడా అలాగే అనుకున్నాడు. మామిడాకుల కోసం వెతికాడు. మామిడాకులు కనిపించగానే కోశాడు. అయితే ఇదే గొడవకు కారణమైంది. అడగకుండా మామిడాకులు కోశాడంటూ ఆ ఇంటి యజమాని వాదనకు దిగాడు. ఈ వాదన కాస్తా గొడవకు,, ఈ గొడవ కాస్తా కత్తిపోట్లకు దారితీసింది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగటంతో ఆ ఇంటి యజమాని.. సదరు వ్యక్తిపై కత్తితో దాడి చేశారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.


కృష్ణా జిల్లా యనమలకుదురుకు చెందిన అర్జునరావు అనే వ్యక్తి మామిడాకుల కోసం ఉదయం వెళ్లాడు. బంధువుల ఇంటికి మామిడాకుల కోసం వెళ్లిన అర్జునరావు.. అక్కడ ఉన్న మామిడాకులు కోశారు. అయితే అడగకుండానే మామిడాకులు కోశాడని అర్జునరావుతో ఆ ఇంటి యజమాని నాంచారయ్య గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదం ఘర్షణకు దారితీయగా.. నాంచారయ్య ఆవేశంలో కత్తితో అర్జునరావుపై దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అర్జునరావు పడమట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై యనమలకుదురు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


మరోవైపు పండుగ వేళ తెలుగు రాష్ట్రాలలో విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. వినాయకచవితి సందర్బంగా గణేశుడి మంటపాలను అలంకరించే సమయంలో కరెంట్ షాక్ తగిలి ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ఏపీలో ఒకరు, తెలంగాణలో మరొకరు చనిపోయారు. అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో వినాయక మండపం ఏర్పాటు చేస్తుున్న సమయంలో కరెంట్ షాక్ తగిలి మహేష్ అనే బాలుడు చనిపోయాడు. అటు తెలంగాణలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దూలపల్లిలోనూ ఇలాంటి ప్రమాదమే జరిగింది. దూలపల్లిలో వినాయకుడి మండపం ఏర్పాటు చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టి నవీన్ అనే యువకుడు చనిపోయాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com