ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అస్సాం ఒకప్పుడు మయన్మార్‌లో భాగమే.. కపిల్ సిబల్

national |  Suryaa Desk  | Published : Sat, Dec 09, 2023, 08:26 PM

సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణలో భాగంగా సీనియర్ లాయర్, ఎంపీ కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలు దేశంలో కొత్త వివాదానికి తెరలేపాయి. ఒకప్పుడు అస్సాం మయన్మార్‌లో భాగం అంటూ కపిల్ సిబల్ వ్యాఖ్యానించడం పెను దుమారానికి కారణం అయింది. అయితే ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర విమర్శలకు తావిచ్చాయి. అస్సాంపై కపిల్ సిబల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 1955 పౌరసత్వ చట్టంలోని సెక్షన్‌ 6 ఏ చెల్లుబాటును సవాల్‌ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇటీవల విచారణను ప్రారంభించింది. ఈ సందర్భంగా తన వాదనలు వినిపించిన కపిల్‌ సిబల్.. అస్సాం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోకి వచ్చే వలసలకు సంబంధించిన ఎలాంటి రికార్డులు ఉండవని పేర్కొన్నారు. ఒకవేళ మీరు అస్సాం చరిత్రను చూస్తే.. ఆ రాష్ట్రంలో ఎవరు ఎప్పుడు వచ్చారని గుర్తించడం సాధ్యం కాదనే విషయం మనకు అర్థమవుతుందని పేర్కొన్నారు. నిజానికి అస్సాం ఒకప్పుడు మయన్మార్‌లో భాగమని కపిల్ సిబల్ సుప్రీంకోర్టులో వాదించారు. 1824లో బ్రిటిష్‌ వారితో చేసుకున్న ఒప్పందంలో భాగంగా మయన్మార్‌ అస్సాంను వారికి అప్పగించిందని కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు.


అయితే అస్సాంపై కపిల్ సిబల్‌ సుప్రీంకోర్టులో చేసిన వాదనలకు సంబంధించిన వార్తలు నేషనల్ మీడియాల్లో రావడంతో తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ నేపథ్యంలోనే కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తీవ్రంగా ఖండించారు. అస్సాం చరిత్ర గురించి తెలియని వారు.. తమ రాష్ట్రం గురించి మాట్లాడొద్దని కపిల్ సిబల్‌కు హిమంత బిశ్వ శర్మ హితవు పలికారు. అస్సాం ఎప్పుడూ మయన్మార్‌లో భాగం కాదని.. కొంతకాలం పాటు దీని గురించి గొడవలు జరిగాయని కూడా హిమంత బిశ్వ శర్మ గుర్తు చేశారు. అంతే తప్ప అస్సాం మయన్మార్‌లో భాగమేనంటూ చెప్పే ఏ సమాచారాన్ని ఇంతవరకూ తాను చూడలేదని అస్సాం సీఎం ఘాటుగా బదులిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com