ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడ ప్రజలకు బిగ్ రిలీఫ్.. ఇక నో టెన్షన్, బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు పూర్తి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 07, 2024, 08:05 PM

విజయవాడ ప్రజలకు బిగ్ రిలీఫ్ దక్కింది.. ఇక నో టెన్షన్, నగర ప్రజలు హాయిగా నిద్రపోవచ్చంటోంది ప్రభుత్వం. నాలుగు రోజులుగా ఒక యుద్ధంలా చేపట్టిన గండ్ల పూడ్చివేత పనులు పూర్తయ్యాయి. విజయవాడను గజ గజలాడించిన బుడమేరు గండ్ల పనులను విజయవంతంగా పూర్తి చేసింది. శనివారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో బుడమేరు మూడో గండి పూడ్చివేత పనులు పూర్తి చేశారు. బుడమేరు మూడు గండ్లను బేస్ లెవెల్ వరకు అధికారులు పూడ్చివేశారు.


బుడమేరు గండి పూడ్చివేత పనులు 95 శాతం పూర్తయ్యాయని.. మిగిలిన ఐదుశాతం పనులు కూడా పూర్తవుతాయన్నారు మంత్రి నారా లోకేష్. ఆయన బుడమేరు గండి పూడ్చివేత పనులను పరిశీలించారు. అక్కడ పూడ్చివేతకు సంబంధించిన పనులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బుడమేరులో పూడ్చిన గండ్లను మరింత ఎత్తు పెంచి పటిష్టపరిచే చర్యలు తీసుకుంటామని అధికారులు, మంత్రులు తెలిపారు. నాలుగు రోజులుగా అక్కడే ఉండి బుడమేరు గండ్ల పూడ్చివేత పనుల్ని పర్యవేక్షించిన మంత్రి రామానాయుడ్ని అందరూ ప్రశంసించారు. బుడమేరు గండ్లను విజయవంతంగా పూర్తి చేసిన మంత్రులు, అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. అతిపెద్ద సవాల్‌ను ఎదుర్కొని పనులు పూర్తి చేశారని ప్రశంసల వర్షం కురిపించారు.


బుడమేరు గండ్ల పూడ్చివేతల పనులు నాలుగు రోజులు పాటు నిరంతరాయంగా జరిగాయి. ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు నాలుగు రోజులుగా అక్కడే ఉన్నారు.. రాత్రి, పగలు తేడా లేకుండా దగ్గరుండి పనుల్ని పర్యవేక్షించారు. ఆయన పట్టువదలని విక్రమార్కుడిలా రాత్రింబవళ్లు అక్కడే ఉన్నారని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పనుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. నాలుగు రోజుల పాటూ శ్రమించి మూడు గండ్లను పూడ్చి వేశారు.


విజయవాడను ఈ బుడమేరు ముంచేసింది.. ఒక్కసారిగా వచ్చిన వరద ప్రవాహంతో నగరం నీట మునిగింది. ఒక్కమాటలో చెప్పాలంటే బుడమేరు పేరు వింటే చాలు బెజవాడ వాసులు వణికిపోయారు. రెండు రోజుల పాటూ వర్షం పడటంతో.. ఆ తర్వాత నుంచి బుడమేరు గండ్లను పూడ్చే పనుల్ని మొదలుపెట్టారు. బుడమేరుకు పడ్డ గండ్లను పూడ్చే పనులను యుద్ధప్రాతిపదికన మొదలుపెట్టారు.. ఉద్ధృతంగా వరద ఉన్నప్పుడే రెండు గండ్లను విజయవంతంగా పూడ్చేశారు. మూడో గండి పూడ్చివేతను ఒకవైపు ఏజెన్సీలు చేయగా.. మరోవైపు హైదరాబాద్ నుంచి వచ్చిన ఆర్మీ జవాన్లు రంగంలోకి దిగి పూర్తి చేశారు. సికింద్రాబాద్‌కు చెందిన రెజిమెంటల్‌ బెటాలియన్‌ జవాన్లతో పాటుగా చెన్నైకు చెందిన 6వ బెటాలియన్ దాదాపు 120 మంది బుడమేరు గండి పూడ్చడంలో భాగస్వాములయ్యారు. మొత్తానికి అందరూ కలిసి విజయవంతంగా బుడమేరకు పడ్డ మూడు గండ్లను పూడ్చివేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com