ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీకి కేంద్రం ఎలాంటి సాయం ప్రకటించలేదు.. చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 07, 2024, 08:08 PM

కేంద్రం తెలుగు రాష్ట్రాలకు భారీగా సాయంగా ఏకంగా రూ.3,300 కోట్లు ప్రకటించిందని హడావిడి నడిచింది. కానీ ఈ వరద సాయంలో కీలక మలుపు తిరిగింది.. తూచ్ కేంద్రం ఎలాంటి సాయం ప్రకటించలేదని తేలింది. ఇదేం ట్విస్ట్ గురూ అనుకుంటున్నారా.. మీరు వింటున్నది నిజమే. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఎలాంటి సాయం ప్రకటించలేదు. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు స్వయంగా ప్రకటించారు. కేంద్రం నుంచి ఎలాంటి సాయం ప్రకటించలేదని తేల్చి చెప్పారు.. చంద్రబాబు క్లారిటీ ఇవ్వడంతో అందరూ అవాక్కయ్యారు.


తెలుగు రాష్ట్రాలకు వరద బాధితుల్ని ఆదుకోవడానికి కేంద్రం రూ.3,300 కోట్లు సాయం ప్రకటించిందంటూ జరుగుతున్నది ప్రచారం మాత్రమే అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. టీవీ ఛానళ్లు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమంతా వట్టిదేనని తేల్చి చెప్పారు. వరద నష్టంపై ఏపీ నుంచి కేంద్రానికి ఇంకా నివేదికే పంపకుండా.. సాయం ఎలా ప్రకటిస్తుందని చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం తరఫున వరద నష్టంపై శనివారం కేంద్రానికి తొలి నివేదిక పంపుతున్నామని చెప్పారు. వరద బాధితులకు కిలో రూ.2, రూ.5, రూ.10 చొప్పున కూరగాయల సరఫరా కొనసాగుతుందని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు, వైద్య శిబిరాలు బాగా జరుగుతున్నాయన్నారు. నీటి సరఫరా, ఆహారం నాణ్యత ప్రజలు సర్వేలో చెప్పారన్నారు.


ముఖ్యమంత్రి చంద్రబాబు వారం రోజులుగా విజయవాడ కలెక్టరేట్‌ ఆవరణలోనే ఉంటున్నారు. ఆయన బస్సులో నిద్రిస్తూ.. అక్కడి నుంచే సహాయ చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితులు కుదుటపడ్డాకే ఇంటికి తిరిగి వెళతానని చెప్పారు. అయితే ఇవాళ అక్కడే వినాయకుడి విగ్రహానికి పూజలు చేసి, దండం పెట్టుకుని మళ్లీ సహాయకచర్యల్లో బిజీ అయ్యారు. 7వ రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద బాధితుల కష్టాలను దృష్టిలో ఉంచుకునే పండుగ పూటా కూడా అవిశ్రాంతంగా పని చేస్తున్నామన్నారు. నిత్యావసరాల పంపిణీ, పారిశుధ్య పనులు కొనసాగుతున్నాయన్నారు.


బాధిత ప్రజలకు త్వరితగతిన రిలీఫ్ ఇచ్చేందుకు పండుగ నాడు కూడా పని చేయాలని కోరానని.. బుడమేరుకు పడిన మూడో గండి పూడ్చే పనులు కొలిక్కి వచ్చాయన్నారు. విజయవాడలోకి నీళ్లు రావు..భవిష్యత్తులో కూడా వరదలు వచ్చినా నీళ్లు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆదివారం సాయంత్రానికి పూర్తిగా వీధుల్లో వరద నీరు తగ్గిపోతుందని.. బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ కూడా శరవేగంగా జరుగుతోందని.. పంపిణీ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఇళ్లల్లో జరిగిన నష్టంపై ఎన్యుమరేషన్ కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సూచనలు చేశారు. శానిటైజేషన్ కూడా సాధ్యమైనంతగా పూర్తి చేయాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com