ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిడ్డను అనుకుని క్షమించండి.. చంద్రబాబుకు మహిళ భావోద్వేగపూరిత లేఖ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 09, 2023, 08:10 PM

మిచౌంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రెండోరోజు పర్యటించారు. బాపట్ల జిల్లాలో పర్యటించిన చంద్రబాబు.. వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రైతులను పరామర్శించి వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ క్రమంలోనే మాజీ సీఎం చంద్రబాబును కలిసిన ఓ మహిళ తన గోడు వెళ్లబోసుకుంది. తుపాను తమ జీవితాల్లో ఎంతంటి కష్టాన్ని తెచ్చిపెట్టిందో చంద్రబాబుకు వివరించింది. ఇదే సమయంలో చంద్రబాబుకు ఓ లేఖను అందించింది సదరు మహిళ. పర్చూరు మండలం కొమ్మిరినేనివారి పాలెం గ్రామంలో.. చంద్రబాబు పర్యటించిన సందర్భంగా ఈ సంఘటన జరిగింది.


బాపట్ల జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు.. పర్చూరు మండలం కొమ్మిరినేనివారిపాలెం సందర్శించారు. మిచౌంగ్ తుపాను కారణంగా దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రబాబును కలిసిన మహిళ ఆయనకు ఓ లేఖను అందించింది. రైతులం చాలా నష్టపోయాం.. చాలా అలసిపోయామని అందులో తన ఆవేదన వ్యక్తపరిచింది. ఆ దేవుడే మమ్మల్ని ఆదుకోవాలంటూ తన బాధను వెల్లడించిన ఆమె.. దేవుడు రూపంలో మీరొచ్చారు సార్ అంటూ చంద్రబాబుపై తనకున్న అభిమానాన్ని తెలియపరిచింది. ఆఖర్లో ఏవైనా తప్పుగా రాస్తే మీ బిడ్డననుకుని క్షమించండి సర్ అంటూ రాసుకొచ్చింది.


చంద్రబాబుకు మహిళ లేఖ


మరోవైపు తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటన సందర్భంగా చంద్రబాబు వైసీపీ సర్కారు మీద విమర్శలు గుప్పించారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు చేయలేని వ్యక్తి మూడు రాజధానులు కడతారంట అంటూ ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలకు


ఇసుక మీద ఉన్న ప్రేమ రైతులపై లేదంటూ విమర్శించారు. రైతులకు గోతాలు కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వమంటూ మండిపడ్డారు.ముఖ్యమంత్రి జగన్ గాల్లో తిరిగి గాల్లోనే తాడేపల్లి వెళ్లిపోయారని విమర్శించారు. మరోవైపు దేశంలో అన్నదాతల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని చంద్రబాబు ఆరోపించారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని తప్పబట్టారు. రైతులకు న్యాయం జరిగే వరకూ వారి తరుఫున తెలుగుదేశం పోరాడుతుందని స్పష్టం చేశారు. రైతు రాజ్యం కోసం టీడీపీ జనసేన కలిసి పనిచేస్తాయని అన్నారు. మిచౌంగ్ తుపాను కారణంగా అపార నష్టం జరిగితే ముఖ్యమంత్రి జగన్ కేంద్రాన్ని సాయం కూడా అడగలేదని విమర్శించారు. ఏపీకి సాయం కోసం ప్రధానికి లేఖ రాయనున్నట్లు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com