తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల శాసనమండళ్లలో ఖాళీ అవుతున్న టీచర్లు, పట్టభద్రుల నియోజకవర్గాల భర్తీకి గురువారం జరిగే పోలింగుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు పోలింగ్ జరుగుతోందని, ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుగు రాష్ట్రాల ఎన్నికల సంఘం ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్లాల్ వెల్లడించారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఎన్నికల నియమావళి అమల్లో ఉంటుందని ఆయన చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో గట్టి భద్రత ఏర్పాటు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో టీచర్ల కోటాలో మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజవర్గం పరిధిలో 12 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. ఏపీలోని ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు నియోజకవర్గం పరిధిలో 9మంది, కడప-కర్నూలు-అనంతపురం నియోజకవర్గ పరిధిలో 10మంది బరిలో ఉన్నారు.