చంద్రబాబు ఓడిపోవాలని తిరుమల కొండపైకి ఎక్కేటప్పుడు ప్రతి మెట్టుకు మొక్కుకున్నానని తెలంగాణ బహిష్కృత నేత మోత్కుపల్లి అన్నారు. కొండ ఎక్కే క్రమంలో తనకు బీపీ కూడా డౌన్ అయిందని... రెండు రోజులు ఆసుపత్రిలో చికిత్స కూడా చేయించుకున్నానని చెప్పారు. చంద్రబాబు మోసకారి అంటూ ఆయన విమర్శించారు. లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఏపీకి అన్యాయం జరగిందని ఒక్క నేత కూడా మాట్లాడలేదని... చంద్రబాబు మోసగాడు అనే విషయం అందరికీ తెలుసని చెప్పారు. విశ్వాస తీర్మానంపై ఒక్క పార్టీ కూడా టీడీపీతో కలిసిరాలేదని అన్నారు. చంద్రబాబు జీవితమంతా మోసం, దగా, వంచనే అని చెప్పారు. తనకు ప్రత్యేక ప్యాకేజీ అవసరం లేదని, ప్రత్యేక హోదానే కావాలని ఆనాడు చంద్రబాబు స్పష్టం చేసి ఉంటే... ఏపీకి స్పెషల్ స్టేటస్ వచ్చేదని మోత్కుపల్లి అన్నారు. జగన్ గెలుస్తాడనే భయంతోనే చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని, ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు వైఖరిని ఏపీ ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు.