కోట: ప్రపంచ యోగా దినోత్సవం రోజు యోగా గురు రాందేవ్ బాబా కొత్త గిన్నిస్ రికార్డును సృష్టించారు. ఆయనతోపాటు రాజస్థాన్ సీఎం వసుంధర రాజె, మరో లక్షా 5 వేల మంది కలిసి ఈ రికార్డులో పాలుపంచుకున్నారు. ఒకేసారి ఎక్కువ మంది యోగాసనాలు వేసిన రికార్డును వీళ్లు క్రియేట్ చేశారు. గతేడాది కూడా ఇంటర్నేషనల్ యోగా డే నాడు పతంజలి కొన్ని వరల్డ్ రికార్డులను క్రియేట్ చేసింది. 51 గంటల పాటు మారథాన్ యోగా చేయడం, పతంజలి యోగ్ పీఠ్ వలంటీర్లు జైపాల్, గోపాల్, మోహన్ శంకర్లు కలిసి అత్యధిక సమయం పాటు శీర్షాసనసం వేయడంలాంటి రికార్డులు సృష్టించారు. ఇవాళ ఉదయం కూడా ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో వేలాది మంది యోగాసనాలు వేశారు. మంచి ఆరోగ్యం కోసం ఇప్పుడు ఎంతో మంది యోగావైపు చూస్తున్నారని నాలుగో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మోదీ అన్నారు. డెహ్రాడూన్లోని ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ప్రధానితోపాటు 50 వేల మంది ఈ యోగా డే సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు.