అమరావతి: భాజపా కొత్త అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు, ఆరోపణలు చేయడమే రాజకీయం అనుకుంటున్నారని మంత్రి కళా వెంకటరావు అన్నారు. విభజన చట్ట పరంగా రాష్ట్రానికి చేయాల్సిన కనీస పనులు కూడా చేయకుండా రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 2019లో రాష్ట్రంలో భాజపా గెలుస్తుందని అంటున్న కన్నా... ఏయే స్థానాల్లో గెలుస్తారో.. ఎవరు గెలుస్తారో చెప్పగలరా? అని ప్రశ్నించారు. అవినీతి, పోలీస్స్టేషన్, తప్పుడు కేసులు కన్నాకు ఇవే గుర్తుకొస్తున్నాయని.. గతంలో ఆయన మంత్రిగా చేసినప్పుడు వీటిలో బాగా అనుభవం ఉన్నట్లుందని ఎద్దేవా చేశారు. విభజన హామీలు నెరవేర్చటం లేదని ప్రశ్నిస్తే జగన్ని పక్కన చేర్చుకుని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఎందుకు ఇవ్వడం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ప్రశ్నిస్తోందని.. భాజపా నేతలు ఇంటింటికి తిరిగి దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.