విజయవాడ : గత ఎన్నికల సమయంలో ఇష్టం లేకపోయినప్పటికీ తాము బిజెపితో కలిసి పోటీ చేశామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. మహానాడులో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ టిడిపిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. ఎపి పట్ల ప్రధాని మోడీ వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని పలుకరించడం పెద్ద తప్పుకింద ప్రతిపక్షాలు విమర్శించడం శోచనీయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన చంద్రబాబునాయుడు మానవత్తమున్న మనిషిగా అక్కడ రాహుల్ గాంధీ భుజం తట్టి పలుకరించారని అచ్చెన్నాయుడు అన్నారు. దీనిని పెద్ద తప్పుగా ప్రతిపక్షాలు విమర్శిస్తూ, టిడిపి కాంగ్రెస్తో మిలాఖత్ అవుతోందని అంటున్నాయని ఆయన చెప్పారు. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి మానవత్వమున్న మనిషిగా పలుకరించడం కూడా తప్పేనా అని ఆయన ప్రశ్నించారు. అసలు టిడిపి పుట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అని ఆయన గుర్తు చేశారు.