న్యూఢిల్లీ : దేశంలోని రైతులకు కనీస మద్దతు ధరలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మన్కీబాత్లో భాగంగా మోదీ ఇవాళ మాట్లాడారు. రైతుల ఆదాయం రెట్టింపు చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఉద్ఘాటించారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ ప్రాధాన్యంపై గాంధీజీ, లాల్బహదూర్ శాస్త్రి, రామ్మనోహర్ లోహియా, చౌదరి చరణ్ సింగ్ ముందే చెప్పారు. కనీస మద్దతు ధరల విషయమై రైతులు లేఖలు రాస్తున్నారని వెల్లడించారు. గాంధీజీ 150వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని పేరొన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంపై అధిక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. దేశ యువత ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు. శరీరాన్ని ధృడంగా ఉంచుకునేందుకు అవసరమైన కృషి చేయాలన్నారు. ఈ సారి విద్యార్థులు పరీక్షలు, అలాగే సెలవులపై లేఖలు రాశారని తెలిపారు. నీటి సంరక్షణ చర్యలపైనా విద్యార్థుల నుంచి లేఖలు వస్తున్నాయన్నారు. ఎండాకాలంలో పశు, పక్ష్యాదుల దాహార్తి తీర్చేందుకు కృషి చేయాలని కోరారు. మై గవర్నమెంట్లో కోమల్ థక్కర్ పోస్టును మోదీ ప్రస్తావించారు. ఆన్లైన్లో సంస్కృతం కోర్సు చేయడాన్ని అభినందించారు. సంస్కృతం పట్ల కోమల్ థక్కర్కు గల అభిమానాన్ని మోదీ ప్రశంసించారు. ఆన్లైన్ కోర్సుల దిశగా యువతను పురిగొల్పాలని అధికారులను ఆదేశించినట్లు ప్రధాని వెల్లడించారు. దేశ ప్రజలకు నరేంద్ర మోదీ.. శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.