చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తన పదవికి రాజీనామా చేయడంతో ఆ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తిగా మారాయి. తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో అమరీందర్ వారసుణ్ని ఎన్నుకునేందుకు నేడు కాంగ్రెస్ శాసనసభాపక్షం మరోసారి భేటీ కానుందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మధ్యాహ్నానికి కొత్త సీఎం పేరు ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మరోవైపు నూతన సీఎం ఎంపిక బాధ్యత అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతిలో ఉందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటున్నారు.
నూతన సీఎం రేసులో ప్రధానంగా నలుగురి పేర్లు వినిపిస్తున్నాయి. పీసీసీ మాజీ అధ్యక్షులు సునీల్ జాఖడ్, ప్రతాప్ సింగ్ బజ్వా, తాజా మాజీ మంత్రి సుఖ్జీందర్ సింగ్ రంధ్వా, మాజీ సీఎం రాజేందర్ కౌర్ భట్టల్లలో ఒకరిని ఎంపిక చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు మాజీ ముఖ్యమంత్రి బేయంత్ సింగ్ మనవడు రన్వీత్ సింగ్, ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ పేరు కూడా వినవస్తోంది. అయితే, సీఎంగా రాజీనామా చేసిన తర్వాత అమరీందర్.. సిద్ధూపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఆయన్ని సీఎంని చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదన్నారు. ఆయన సీఎం కావడం పంజాబ్కు నష్టదాయకమని విరుచుకుపడ్డారు.