కృష్ణాజిల్లా పెడన మండలం చేవేండ్రపాలెంకు చెందిన యువకుడు కటకం వీరాంజనేయులుకి మచిలీపట్నంకు చెందిన యువతితో పెళ్లి కుదిరింది. మే 13న పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు. ఇంటిల్లిపాది పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఈనెల 5వ తేదీన బయటకు వెళ్లిన వీరాంజనేయులు మళ్లీ తిరిగిరాలేదు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. న్యూస్ 18 కథనం మేరక.. యువకుడు అదృశ్యం ఘటన గ్రామంలో కలకలం రేపింది. మిస్సింగ్ కేసుపై పోలీసులు దర్యాప్తు చేయగా యువకుడు భారీగా నగదుతో పరారైనట్లు తేలింది. ఎల్ అండ్ టీ సంస్థలో కాంట్రాక్టులు చేస్తున్నట్లు బంధువుల, స్నేహితులతో పాటు గ్రామస్తులను నమ్మించిన ఆంజనేయులు అధిక వడ్డీల పేరుతో భారీగా నగదు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఓస్థానిక ప్రజాప్రతినిథి నుంచి రూ.5లక్షలు తీసుకొని తక్కువ వ్యవధిలో రెట్టింపు మొత్తం ఇవ్వడంతో స్థానికులంతా మనోడి వలలో పడ్డారు.
దీంతో చేవేంద్రపాలెం, చేవెండ్ర, చెన్నూరు, ఉప్పలకలవగుంటపాలెం గ్రామాలకు చెందిన రైతులు ఇతనికి భారీగా డబ్బులు ఇచ్చారు. ఇలా దాదాపు రూ.1.50 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. పెట్టుబడిదారుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఐతే పోలీసులు మాత్రం రూ.70 లక్షలు వసూలు చేసినట్లు చెప్తున్నారు. ఐతే ఇందుకు రుణఒత్తిడే కారణమా..? లేక ప్రేమ వ్యవహారం ఏదైనా ఉందా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారాన్ని పెడన పోలీసులు క్యాష్ చేసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఓ కానిస్టేబుల్ ఆంజనేయులు కాల్ డేటాలో మీ నెంబర్ ఉందంటూ గ్రామస్తులను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. విచారణ పేరుతో కొందరిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.