కరోనా వైరస్ రెండో వేవ్ ఉద్ధృతిని కేంద్రం నిశితంగా పరిశీలిస్తోంది. ఒకపక్క ప్రతిపక్షాలు, మరోపక్క విదేశాల సానుభూతి, ఇంకొక పక్క దేశంలో హృదయవిదారక దృశ్యాలు వీటన్నింటినీ ఎదుర్కొంటూనే పటిష్టంగా కట్టడి చేయడానికి ప్రధాని మోడీ అడుగులు వేస్తున్నారు. ఆక్సిజన్ కొరతపై సమీక్షించి, ఒక కొలిక్కి తేవడానికి ప్రయత్నించిన ప్రధాని ఇప్పుడు ప్రజలకు సేవలందించడానికి సైన్యం ఎలా సన్నద్ధమవుతోందో పరిశీలించే అంశాన్ని గురువారం సమీక్షించారు. ఈ పరిస్థితుల్లో సైన్యం చేపడుతున్న చర్యలను పరిశీలించారు. కోవిడ్ రోగుల సంఖ్య పెరుగుతుండటంతో ఆసుపత్రుల్లో ఆక్సిజన్, పడకల కొరత దేశాన్ని వేధిస్తున్న నేపథ్యంలో భారత సైన్యం చీఫ్తో మోదీ సమావేశమయ్యారు.
ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, భారత సైన్యం చీఫ్ జనరల్ ఎంఎం నరవనేతో ప్రధాని మోదీ గురువారం సమావేశమయ్యారు. కోవిడ్ మేనేజ్మెంట్లో సైన్యం చేపడుతున్న సహాయ కార్యక్రమాలపై చర్చించారు. సైన్యంలోని వైద్య సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వాలకు అందుబాటులో ఉంచినట్లు జనరల్ నరవనే తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో తాత్కాలిక ఆసుపత్రులను సైన్యం నిర్మిస్తోందని చెప్పారు. సాధ్యమైన చోట ప్రజల కోసం ఆసుపత్రులను నిర్మించేందుకు సైన్యం సిద్ధంగా ఉందని చెప్పారు. సమీపంలోని సైనిక ఆసుపత్రులను సందర్శించి, వైద్య సేవలు పొందాలని ప్రజలను కోరారు. దిగుమతి చేసుకున్న ట్యాంకర్ల కోసం అవసరమైన సిబ్బందిని పంపించినట్లు తెలిపారు. వాటిని నిర్వహించేందుకు ప్రత్యేక నైపుణ్యంగలవారిని నియోగిస్తున్నట్లు తెలిపారు.