ఏపీలో మరో దారుణం జరిగింది. తనతో కలసి ఆత్మహత్య చేసుకునేందుకు నిరాకరించిందన్న కోపంతో ప్రియురాలిని ప్రియుడు దారుణంగా చంపేశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. కళ్యాణదుర్గం మండలం చాపిరికి చెందిన షాహిదాబేగం(20), అదే గ్రామానికి చెందిన రఘు(20) కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఇద్దరి ప్రేమ విషయం తెలిసిన ఇరువురి కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. ఇద్దరికీ వేర్వేరుగా వివాహాలు నిశ్చయించారు. ఇద్దరికీ పెళ్లిళ్లు నిశ్చయం కావడంతో రఘు పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆస్పత్రిలో చికిత్స పొంది.. ఇంటికి వచ్చాడు. ఈ నెల 17న రాత్రి ఆమెను బైక్ ఎక్కించుకుని కణేకల్లు మండలం మాల్యం గ్రామం వద్దకు తీసుకెళ్లి తనను పెళ్లి చేసుకోవాలంటూ కోరాడు. అందుకు ఆమె నిరాకరించిందని హెచ్ఎల్సీ కాల్వలో తోసేశాడు. నీటి ఉధృతికి ఆమె కొట్టుకుపోయింది. ఈ నెల 19న పోలీసులు రఘును అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. కణేకల్లు మండలం తుంబిగనూరు వద్ద కాల్వలో తేలియాడుతున్న యువతి మృతదేహాన్ని గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.