భారత జాతినుద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..
“కరోనా సమయంలో అన్ లాక్ 2లోకి ప్రవేశించాం. వర్షాలు పడే సమయంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇతర దేశాలతో పోలిస్తే కరోనా పై పోరులో మెరుగ్గానే ఉన్నాం. లాక్ డౌన్ చాలా మంది ప్రాణాలను కాపాడింది. సరైన సమయలో లాక్ డౌన్ విధించి చాలా ప్రాణ నష్టాన్ని తగ్గించాం. కేసులు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. కంటైన్మెంట్ జోన్ల పై రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలి. కేసులు పెరుగుతున్న సమయంలో జాగ్రత్త పాటించకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.పబ్లిక్ ప్లేస్ లో మాస్కు పెట్టుకోనందున ఒక దేశ ప్రధానికే ఫైన్ వేశారు. ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు పాటించాలి. సర్పంచ్ నుంచి ప్రధాని వరకు ఎవరూ నియమాలకు అతీతులు కారు. పేదల ఖాతాల్లో రూ.31 వేల కోట్లు జమ చేశాం. పేదలకు రూ.1.75లక్షల కోట్లు జమ చేశాం. పేదలెవరూ ఆకలితో అలమటించకుండా చూశాం. 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇచ్చాం. నవంబర్ వరకు పేదలకు ఫ్రీ రేషన్ అందిస్తాం. వన్ నేషన్ వన్ రేషన్ తో వలస కూలీలకు లబ్ది జరుగుతుంది. దేశంలో ఎక్కడి నుంచైనా ఇక రేషన్ తీసుకోవచ్చు.ఉచిత రేషన్ కోసం రూ.90 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాం. ప్రతి కుటుంబంలో ఒకరికి కిలో కందిపప్పు,5 కిలోల బియ్యం అందజేస్తాం.” అని ప్రధాని మోడీ అన్నారు.