ఆదాయం పాతాళంలో, ధరలు ఆకాశంలో కరోనా భూమి మీద ఉన్న సమయంలో ప్రభుత్వం డీజిల్, పెట్రల్ ధరలు పెంచి పేద, సామాన్య ప్రజల, రైతుల నడ్డి విరుస్తోందని టీడీపీ అధికార ప్రతినిధి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ అన్నారు. నేను విన్నాను నేను ఉన్నానని ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన జగన్ కి పెరిగిన రేట్ల గురించి వినపడటం లేదా? ప్రజల సమస్యలు కనపడటం లేదా? అని ప్రశ్నించారు. 20 రోజుల వ్యవధిలోనే పెట్రోల్, డీజిల్ ధరలు సుమారు రూ. 10 పెరిగాయని రాష్ర్ట ప్రభుత్వానికి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వం నుంచి పన్నులు రూపంలో లీటర్ పెట్రోల్ పై మెత్తం రూ. 30, లీటర్ డీజిల్ పై రూ. 25 ఆదాయం వస్తోందన్నారు. కరోనా వల్ల ప్రజలు, కార్మికులు ఉపాధి లేక తినడానికి తిండిలేక, ప్రజా రవాణా లేక నానా అవస్ధలు పడుతుంటే ఈ సమయంలో పెట్రోల్ ,డీజిల్ ధరలు పెంచటం ఏంటి? అని ప్రశ్నించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల వల్ల 1.27 లక్షల మంది ప్రజలు విలవిలలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. చంద్రబాబు హయాంలో రూ. 75 పెట్రోల్ చేరితే రూ. 2 తగ్గించారని గుర్తు చేసారు. పెరిగిన ధరలపై రాష్ర్ట ప్రభుత్వం స్పందిస్తుందని ప్రజలు 20 రోజుల నుంచి ఎదురు చూసినా కానీ మంత్రులు ఎవరూ స్పందించలేదని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం మానుకుని ఇప్పటికైనా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని గొట్టిపాటి హితవు పలికారు.