ఏపీలో ఇకనుంచి పేదల ఇళ్ల వద్దకే రేషన్ పంపిణీ కానుంది. రేషన్ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రూపొందించిన నమూనా వాహనాలను మంత్రులు పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామవాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టిన ప్రభుత్వం, వారి ద్వారానే ప్రతీ పేదింటికి రేషన్ పంపిణీ చేయనుంది. ఈ క్రమంలోనే బియ్యం, ఇతర సరుకులను ఇంటి ముందుకే తీసుకువచ్చి వాలంటీర్ల సాయంతో పంపిణీ చేయాలని సీఎం జగన్ సర్కారు నిర్ణయించింది. పంపిణీకి అనువైన వాహనాన్ని ప్రభుత్వం రూపొందించగా.. ఈ వాహనం ద్వారా నిత్యావసరాల పంపిణీ ట్రయల్ రన్ను కూడా నిర్వహించారు అధికారులు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, రాష్ట్ర ఆర్థికమంతి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు పరిశీలించారు. ప్రజా పంపిణీ పారదర్శకంగా ఉండాలనేదే తమ ప్రభుత్వ ధ్యేయమని ఈ సంధర్భంగా కొడాలి నాని చెప్పుకొచ్చారు.