ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల లడ్డూ వివాదం వేళ హైకోర్టులో వైవీ సుబ్బారెడ్డి పిటిషన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 21, 2024, 11:39 PM

తిరుమల లడ్డూపై వివాదం వేళ ఆసక్తికర పరిణామం జరిగింది. టీటీడీ మాజీ ఛైర్మన్, వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఏపీ హైకోర్టును పిటిషన్‌ను ఆశ్రయించారు. గత ప్రభుత్వం హయాంలో.. టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా తాను తీసుకున్న నిర్ణయాలు, నిధుల దుర్వినియోగం ఆరోపణలతో ప్రభుత్వం తనపై విజిలెన్స్ నిర్వహిస్తోందని.. వెంటనే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణను రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీటీడీ ఛైర్మన్ హోదాలో తాను తీసుకున్న నిర్ణయాలపై వివరణ ఇవ్వాలని విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీ తనను కోరారని పిటిషన్‌లో ప్రస్తావించారు.


అయితే తనపైఆరోపణలేంటి? అందుకు సంబంధించిన ఫైళ్లు ఇవ్వాలని విజిలెన్స్ ఎస్పీని కోరితే స్పందించలేదంటున్నారు వైవీ సుబ్బారెడ్డి. తాను వివరణ ఇవ్వకుండానే విచారణ పూర్తిచేశారని.. టీటీడీ వ్యవహారాల్లో విచారణ జరిపే అధికారం రాష్ట్ర విజిలెన్స్‌ విభాగానికి లేదు అని పిటిషన్‌లో పేర్కొన్నారు. టీటీడీకి స్వయం ప్రతిపత్తి ఉందని.. అంతర్గత విషయాలపై విచారణ చేసేందుకు టీటీడీకి సొంత విజిలెన్స్‌ విభాగం ఉందన్నారు. అందుకే రాష్ట్ర విజిలెన్స్‌ విచారణ ప్రక్రియను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని హైకోర్టును కోరారు. ఈ పిటిషన్‌లో సీఎస్, సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి, టీటీడీ ఈవో, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్, ఎస్పీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. వైవీ సుబ్బారెడ్డి పిటిషన్‌పై కోర్టు సోమవారం విచారణ జరపనుంది.


మరోవైపు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో వైఎస్సార్‌సీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నెయ్యి కల్తీ అంశంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాస్తవాలను తేల్చేందుకు హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని కోర్టును లాయర్ కోరారు. ఒకవేళ సిట్టింగ్‌ జడ్జితో విచారణ సాధ్యం కాకపోతే.. విచారణ నిమిత్తం ఓ కమిటీని ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని అభ్యర్థించారు. అలా చేస్తే వాస్తవాలు బయటపడతాయన్నారు. ఈ అభ్యర్థనతో తాము పిల్‌ దాఖలు చేయనున్నామని.. దీనిపై విచారణ జరపాలని కోరారు.


శ్రీవారి లడ్డూలో ఉపయోగించే నెయ్యి విషయంలోవాస్తవాలను తెలుసుకోకుండా.. ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తున్నారని.. అందుకే నిజాలు బయటకు రావాలన్నారు. ఈ అంశం వందల కోట్ల మంది శ్రీవారి భక్తుల మనోభావాలకు సంబంధించినది కాబట్టి విచారణ జరిపించాలని కోరారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను తాము బుధవారం విచారణ చేస్తామని హైకోర్టు తెలిపింది.. ఈలోపు పిల్ దాఖలు చేయాలని సూచించింది. దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై దుమారం రేగుతోంది. ఇలాంటి సమయంలో వైవీ సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించడం ఆసక్తికరంగా మారింది. తనపై రాష్ట్ర ప్రభుత్వం చేయిస్తున్న విజిలెన్స్ విచారణ నిలిపివేయాలని కోరడం కూడా చర్చనీయాంశంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com