ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త స్కీమ్ 'ఎన్‌పీఎస్ వాత్సల్య' కోసం ఎగబడుతున్నరు.. తొలిరోజే 10 వేల మంది నమోదు

business |  Suryaa Desk  | Published : Sun, Sep 22, 2024, 12:13 AM

పిల్లలకు ఆర్థిక భరోసా కల్పించేలా దీర్ఘకాలంలో మంచి బెనిఫిట్స్ అందించే సరికొత్త పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అదే ఎన్‌పీఎస్ వాత్సల్య పథకం. ఈ కొత్త పథకాన్ని సెప్టెంబర్ 18, 2024 రోజున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పథకాన్ని అనూహ్యమైన స్పందన లభిస్తోంది. మల్టిపుల్ బెనిఫిట్స్ అందిస్తున్న క్రమంలో ఈ పథకంలో తమ పిల్లలను చేర్పించేందుకు ఎగబడుతున్నారు. ఈ పథకం ప్రారంభించిన తొలిరోజే దాదాపు 10 వేల మంది పిల్లల పేర్లను నమోదు చేశారు. ఇంతలా డిమాండ్ ఉండేందుకు గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


ఎన్‌పీఎస్ వాత్సల్య స్కీమ్ ప్రారంభించిన తొలి రోజే ఏకంగా 9705 మంది మైనర్లు సబ్‌స్క్రైబ్ చేసుకున్నట్లు పెన్షన్ రెగ్యులేటరీ సంస్థ పీఎఫ్ఆర్‌డీఏ ఓ ప్రకటనలో తెలిపింది. అందులో ఇ-ఎన్‌పీఎస్ పోర్టల్ ద్వారానే 2,197 ఖాతాలు తెరిచినట్లు వెల్లడించింది. ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తున్నట్లు పేర్కొంది. ముందు ముందు ఎన్‌పీఎస్ వాత్సల్య ఖాతాలు తెరిచే వారి సంఖ్య గణనీయంగా పెరగనుందని అంచనా వేసింది.


ఎన్‌పీఎస్ వాత్సల్య ప్రయోజనాలివే..


18 సంవత్సరాల లోపు వయసు ఉండే పిల్లల పేరుపై ఎన్‌పీఎస్ వాత్సల్య ఖాతా తెరిచి పెట్టుబడి కొనసాగించవచ్చు. వారి పేరిట ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉండాలి. ఈ పథకంలో ఏడాదికి కనీసం రూ.1000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పిల్లల పేరిట ఈ ఖాతాలో ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. పిల్లలకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఎన్‌పీఎస్ వాత్సల్య అకౌంట్ సాధారణ ఎన్‌పీఎస్ అకౌంట్‌గా మారుతుంది. అప్పుడు అవసరమైన కేవైసీ డాక్యుమెంట్లు ఇవ్వాలి. ఈ పథకంలో మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత 25 శాతం పెట్టుబడిని విత్ డ్రా చేసుకోవచ్చు. విద్య, వైద్య ఖర్చుల కోసం వీటిని ఉపసంహరించుకోవచ్చు. అయితే, 3 సార్లు మాత్రమే విత్ డ్రా చేసుకోనేందుకు అవకాశం కల్పించారు.


పిల్లల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, గార్డియెన్ లేదా తల్లిదండ్రుల కేవైసీ డాక్యుమెంట్లు అంటే అడ్రస్, గుర్తింపు కార్డులు అవసరం అవుతాయి. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఈ ఖాతా తెరవవచ్చు. లేదా ఇ-ఎన్‌పీఎస్ పోర్టల్ ద్వారా ఖాతా తెరిచేందుకు అవకాశం కల్పించారు. ఇప్పటికే 7 బ్యాంకులు ఎన్‌పీఎస్ వాత్సల్య స్కీమ్ ఖాతాలు తెరిచేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. ఇందులో అప్పుడే పుట్టిన పాప పేరుపై ఏడాదికి రూ.10 వేల చొప్పున పెట్టుబడి కొనసాగించారు అనుకుందాం. సగటున 12.86 శాతం రాబడి అంచనా వేస్తే.. 18 ఏళ్లు వచ్చే నాటికి మొత్తం చేతికి రూ.8 లక్షలు అందుతాయి. ఇందులో 20 శాతం రూ.1.69 లక్షలు తీసుకోవచ్చు. 80 శాతం యాన్యుటీ స్కీమ్ కొనుగోలు చేయాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com