ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖపట్నం-దుర్గ్ వందేభారత్ ఛార్జీల వివరాలివే.. 60 కిమీ దూరానికి ఎంతో తెలిస్తే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 21, 2024, 11:35 PM

విశాఖపట్నం-దుర్గ్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ రైలుకు సంబంధించిన ఛార్జీలపై క్లారిటీ వచ్చింది.. అయితే ఈ ఛార్జీలు సామాన్యులకు కాస్త భారంగా మారాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ-విజయనగరం మధ్య దూరం 60 కిలోమీటర్ల దూరానికి వందేభారత్‌లో ఛైర్‌కార్‌ ఛార్జీ రూ.435 కాగా.. ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌కార్‌లో రూ.820గా ఛార్జీలు ఉన్నాయి. అదే సాధారణంగా ఆర్టీసీ డీలక్స్‌ బస్సులో దాదాపు రూ.100 ఛార్జీ ఉంటుంది. ఇలా చూస్తే.. వందేభారత్‌లో నాలుగు రెట్లు అధికం అంటున్నారు.


విశాఖపట్నం నుంచి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఛార్జీల వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం నుంచి విజయనగరంనకు ఛైర్ కార్ రూ.435, అదే ఎగ్జిక్యూటివ్ ఛైర్‌కార్ రూ.820. విశాఖపట్నం నుంచి పార్వతీపురంనకు చూస్తే.. ఛైర్‌కార్ రూ.565, ఎగ్జిక్యూటివ్ కారు రూ.1075గా నిర్ణయించారు. విశాఖపట్నం నుంచి రాయగడకు ఛైర్‌కార్ రూ.640, ఎగ్జిక్యూటివ్ రూ.1230 ఛార్జీ నిర్ణయించారు. విశాఖపట్నం నుంచి రాయ్‌పూర్‌కు ఛైర్‌కార్ రూ.1435, ఎగ్జిక్యూటివ్ రూ.2645.. విశాఖపట్నం నుంచి దుర్గ్‌కు ఛైర్‌కార్ రూ.1495, ఎగ్జిక్యూటివ్ రూ.2760గా నిర్ణయించారు. ఈ ఛార్జీల దెబ్బకు సామాన్యులు ఆందోళనలో ఉన్నారు. అయితే అధికారుల వాదన మాత్రం మరోలా ఉంది. దూర ప్రాంత ప్రయాణికులకు ఈ రైలు ఉపయోగకరంగా ఉంటుందని.. సమయం ఆదా కావడంతోపాటు సౌకర్యవంతమైన ప్రయాణం లభ్యమవుతుందని చెబుతున్నారు.


మరోవైపు విశాఖపట్నం నుంచి దుర్గ్‌కు ప్రారంభమైన కొత్త వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు తొలిరోజు పెద్దగా ఆదరణ లభించే లేదు. ఈ నెల 16న లాంఛనంగా ఈ రైలును ప్రధాని మోదీ వర్చువల్‌‌గా ప్రారంభించారు.. కానీ ఈ నెల 20వ తేదీ నుంచి రెగ్యులర్‌గా వారానికి ఆరు రోజులు అందుబాటులోకి వచ్చింది. ఈ వందేభారత్ రైలులో మొత్తం1,286 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే విశాఖపట్నం నుంచి శుక్రవారం వెళ్లిన రైలులో మూడొంతుల సీట్లు ఖాళీగానే ఉన్నాయి. శనివారం కూడా రిజర్వేషన్లు అంతంతమాత్రంగానే ఉంది.


అయితే ఈ రైలు ప్రారంభమైన రెండు రోజులు మాత్రమే అవుతోందని.. ప్రయాణికుల సంఖ్య మెల్లిగా పెరుగుతుందని రైల్వేశాఖ అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ రైలుకు మరికొన్ని స్టేషన్‌లలో కూడా హాల్ట్‌లు ఇవ్వాలని ప్రయాణికులు కోరుతున్నారు.


మరోవైపు పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అక్టోబరు 5 నుంచి విశాఖపట్నం-అరకు మధ్య ప్రత్యేక రైలు సర్వీసులు ఏర్పాటు చేశారు. ఈ రైలు (08525) అక్టోబర్ 5 నుంచి 15వ తేదీ వరకూ ప్రతిరోజు ఉదయం 8.30 గంటలకు విశాఖలో బయలుదేరి.. 11.30 గంటలకు అరకులోయ చేరుతుంది. ఈ రైలు (08526) తిరుగు ప్రయాణంలో అదే తేదీల్లో మధ్యాహ్నం 2.00 గంటలకు అరకులోయలో బయలుదేరి సాయంత్రం 6.00 గంటలకు విశాఖ వెళుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com