కరోనా నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ కాస్త కళ్యాణ వేదికగా మారిపోయింది. ఇద్దరు ప్రేమికులు క్వారంటైన్లోనే పెళ్లి చేసుకున్నారు. నిర్వాహకులుగా ఉన్న టీచర్లు, వైద్య సిబ్బంది, ఆశావర్కర్లు పెళ్లి పెద్దలుగా మారిపోయారు. ఈ అరుదైన ఘటన ఒడిశా రాష్ట్రంలోని సాగాడ గ్రామంలో వెలుగుచూసింది. సంప్రదాయ బద్ధంగా కొత్త బట్టల ధరించి మూడు ముళ్ల బంధంతో ఏడడుగులు వేసి కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
సౌరబ్ దాస్ అనే యువకుడు, అదే గ్రామానికి చెందిన పింకీరాణినితో ప్రేమలో పడ్డారు. ఇంట్లో చెప్పకుండా ఈ ఏడాది జనవరిలో అహ్మదాబాద్ నగరానికి పారిపోయారు. అక్కడే ఒక ప్లాస్టిక్ పరిశ్రమలో పనిచేస్తూ ఇద్దరూ కలిసి సహజీవనం చేశారు. లాక్ డౌన్ సమయంలో పరిశ్రమ మూసివేయడంతో ప్రేమికుల జంట ఎంతో కష్టనష్టాలు పడి సాగాడ గ్రామానికి తిరిగివచ్చింది. దీంతో వారిని అధికారులు క్వారంటైన్ చేశారు. 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉన్నతర్వాత క్వారంటైన్ నిర్వాహకులే వారికి పెళ్లి చేశారు. గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుడు, ఆశా కార్మికుడు, అంగన్ వాడీ వర్కర్లు ఈ ప్రేమజంటను ఆశీర్వధించారు.